Indian pilot Gopi Thotakura: రోదసిలోకి తెలుగు వ్యక్తి .
విజయవంతంగా యాత్ర పూర్తిచేసిన గోపీచంద్ తోటకూర;
అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపిచంద్ తోటకూర రికార్డు సృష్టించారు అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ పర్యాటకుడిగా గుర్తింపు పొందారు. బ్లూ ఆరిజిన్ ఎన్ఎస్ 25 మిషన్ ద్వారా ఆయన ఆదివారం అంతరిక్షంలోకి వెళ్లి సురక్షితంగా తిరిగొచ్చారు. పశ్చిమ టెక్సాస్ నుంచి ఆరుగురు సభ్యులతో తమ ఏడో మానవ సహిత వ్యోమనౌక(న్యూ షెఫర్డ్) రోదసిలోకి వెళ్లినట్టు బ్లూ ఆరిజిన్ సంస్థ సోషల్ మీడియాలో ప్రకటించింది.
పర్యటన తర్వాత వీరు వెళ్లిన కాప్సూల్ పారాచూట్ సాయంతో తిరిగి భూమి మీదకు చేరుకుంది. భూవాతావరణం, అంతరిక్ష సరిహద్దుగా భావించే కర్మన్ రేఖ ఎగువకు, భూవాతావరణం నుంచి 105.7 కిలోమీటర్ల ఎత్తుకు ఈ వ్యోమనౌక వెళ్లి వచ్చింది. అక్కడ కొన్ని నిమిషాల పాటు వీరు భారరహిత స్థితిని అనుభూతి పొంది తిరిగొచ్చారు. అంతరిక్ష పర్యటన కోసం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ను స్థాపించిన సంగతి తెలిసిందే.
ఈ కంపెనీ ఇప్పటికే న్యూ షెపర్డ్ మిషన్ పేరిట అంతరిక్ష యాత్రలకు శ్రీకారం చుట్టింది. బ్లూ ఆరిజిన్ రాబోయే సంవత్సరాల్లో NASA సహకారంతో మానవులను చంద్రునిపైకి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా.. బ్లూ ఆరిజిన్ న్యూ షెపర్డ్ -25 మిషన్లోని ఆరుగురు సిబ్బందిలో భారతీయ సంతతికి చెందిన గోపీచంద్ తోటకూర ఉన్నారు. ఎన్ఎస్-25 మిషన్కు గోపీచంద్ సహా మొత్తం ఆరుగురిని ఎంపిక చేశారు. వెంచర్ క్యాపిలిస్ట్ మాసన్ ఏంజెల్, ఫ్రాన్స్ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్ వ్యాపారి కెన్నెత్ ఎల్ హెస్, సాహసయాత్రికుడు కరోల్ షాలర్, అమెరికా వైమానికదళ మాజీ కెప్టెన్ ఎడ్ డ్వైట్ ఎన్ఎస్-25లో ప్రయాణించనున్నారు. డ్వైట్ 1961లో అంతరిక్షయానానికి ఎంపికైన తొలి నల్లజాతి వ్యోమగామి. కానీ, వివిధ కారణాల వల్ల ఆయనకు రోదసీలోకి వెళ్లే అవకాశం మాత్రం రాలేదు.
ఎవరీ గోపీచంద్?
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన గోపీచంద్ అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడే పైలట్ శిక్షణ తీసుకున్నారు. పలు కమర్షియల్ జెట్లు, స్కైప్లేన్లు, ఎయిర్ ఆంబులెన్స్లకు పైలట్గా వ్యవహరించారు. తర్వాత ఆయన అట్లాంటాలో ప్రిజర్వ్ లైఫ్ కార్ప్ అనే వెల్నెస్ కేంద్రాన్ని స్థాపించారు. 1984లో రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా, తొలి భారతీయ అంతరిక్ష పర్యాటకుడిగా గోపీచంద్ చరిత్రకెక్కారు.