Iran: ఇరాన్‌లో ముగ్గురు భారతీయులు అదృశ్యం..

రూ.కోటి డిమాండ్‌ చేసిన కిడ్నాపర్లు;

Update: 2025-05-29 00:45 GMT

బతుకుదెరువు కోసం ఇరాన్ వెళ్లిన ముగ్గురు భారతీయులు అదృశ్యమయ్యారు. దీంతో వారి జాడ తెలియక కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. తమ బిడ్డల జాడ గుర్తించాలని ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని భారతీయ రాయబార కార్యాలయాన్ని కుటుంబ సభ్యులు సంప్రదించారు.

అదృశ్యమైన వ్యక్తులు పంజాబ్‌కు చెందిన హుషన్‌ప్రీత్ సింగ్ (సంగ్రూర్), జస్పాల్ సింగ్ (ఎస్‌బీఎస్ నగర్), అమృతపాల్ సింగ్ (హోషియార్‌పూర్)గా గుర్తించారు. హోషియార్‌పూర్ ఏజెంట్ సాయంతో మే 1న ఇరాన్‌ వెళ్లారు. ఇరాన్‌లోకి అడుగుపెట్టగానే దుండగులు బంధించి వాళ్లను తాళ్లతో కట్టి.. కుటుంబ సభ్యులకు ఫొటోలు పంపించి రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మే 11 నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో టెహ్రాన్‌లోని భారతీయ రాయబార కార్యాలయాన్ని కుటుంబ సభ్యులు సంప్రదించారు. దీంతో ఎంబసీ అధికారులు.. ఇరాన్ ప్రభుత్వానికి సమాచారం అందించారు. భారతీయుల జాడ గుర్తించాలని కోరారు. ఇక ఎప్పటికప్పుడు సమాచారాన్ని కుటుంబ సభ్యులతో ఎంబసీ పంచుకుంటోంది. ఇన్ని రోజులైనా తమ పిల్లల జాడ ఇంకా తెలియకపోవడంతో భయాందోళన చెందుతున్నారు.

పంజాబ్‌లోని హోషియార్‌పూర్ ఏజెంట్ దుబాయ్-ఇరాన్ మార్గం ద్వారా ఆస్ట్రేలియాకు పంపుతానని ముగ్గురికి హామీ ఇచ్చి తీసుకెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు. చివరికి ఇరాన్‌లో బస కల్పిస్తున్నట్లు ఏజెంట్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ మే 1న ఇరాన్‌లో అడుగుపెట్టగానే ముగ్గురు కిడ్నాప్‌నకు గురయ్యారు. ఇక అప్పటినుంచి ఏజెంట్ జాడ కూడా పత్తాలేకుండాపోయింది. అతడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. ఏజెంట్ ఆచూకీ తెలిస్తే.. తమ బిడ్డలు ఎక్కడున్నారన్నది తెలుస్తుందని చెబుతున్నారు. కిడ్నాపర్లు రూ.కోటి ఇవ్వాలని ఫోన్ చేసి బెదిరించినట్లు తెలిపారు. ప్రస్తుతం ముగ్గురి జాడ కోసం ఇరాన్ అధికారులు గాలిస్తున్నారు.

Tags:    

Similar News