Rishi Sunak :బ్రిటన్ ప్రధానికి పెన్ను పోటు
రిషి సునాక్ ఎరేజబుల్ ఇంక్ పెన్నుపై విమర్శలు, వివరణలు;
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ చుట్టూ ఓ వివాదం ముసురుకుంది. అతను వాడుతున్న పెన్ను ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. రిషి సునాక్ వాడే ఎరేజబుల్ ఇంక్ పెన్నుపై బ్రిటన్లో ఉన్న నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దాని వల్ల భద్రతా పరమైన సమస్యలు తలెత్తుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సంతకం పెట్టడానికి ఏ పెన్ అయితేనేంరాస్తే చాలు అని మనం అనుకుంటాం. కానీ ప్రముఖులు వాడే పెన్ లు కూడా వివాదాస్పదం అవుతాయి. విమర్శలకు దారి తీస్తాయి.
ఎన్నో సవాళ్లు, సంక్షోభాల మధ్య పదవిని చేపట్టిన బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ చుట్టూ ఏదో ఒక విషయం పై వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. మొదట అతను లండన్ నుంచి లీడ్స్ నగరానికి ప్రైవేట్ జెట్ ను వినియోగించడం పై వివాదం, తరువాత ఒక వీడియో చిత్రీకరణ కోసం కాసేపు సీటు బెల్ట్ తీసాడు ఆయన. అంతే.. ప్రధానికి ట్రాఫిక్ రూల్స్ తెలియవా అంటూ విపక్షాలు హడావిడి చేసాయి. ఇప్పుడు తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. అదే పెన్ను వివాదం.. ఏ పెన్నులోనైనా ఉండేది ఇంకే.. అయితే ఋషి సునాక్ వాడుతున్న ఈ పెన్ను లో ఉన్నది మాత్రం ఎరేజబుల్ ఇంక్. ఈ పెన్నుతో ఏదైనా రాస్తే తర్వాత దాన్ని తుడిచి వేయచ్చు. ఈ సౌలభ్యం భద్రతాపరంగా అనేక సవాళ్లు తీసుకువస్తుంది అనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు ది గార్డియన్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. రుషి సునాక్ అధికారిక పత్రాల్లో రాసిన అంశాలను ఎవరైనా సులభంగా తొలగించే అవకాశం ఉంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పెన్నులు ఉపయోగించడం వల్ల రాజకీయ నాయకులపై ప్రజల్లో విశ్వాసం పోతుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
రిషి సునాక్ గతంలో ఛాన్సలర్గా ఉన్న సమయంలో డిస్పోసబుల్ పైలట్ వి పెన్నులను వినియోగించేవారు. అయితే ప్రస్తుతం ప్రధాని అయిన తర్వాత కూడా అవే పెన్నులను అధికారిక కార్యక్రమాల్లో ఉపయోగిస్తున్నారని చెబుతున్నారు. 15 రోజుల క్రితం బ్రిటన్ మంత్రివర్గ సమావేశంలో కూడా సునాక్ చేతిలో ఇదే రకమైన పెన్ను కన్పించడం విమర్శలకు తావిస్తోంది. ఇటీవల మాల్డోవాలో జరిగిన యూరోపియన్ పొలిటికల్ కమ్యూనిటీ సమావేశంలో అధికారిక పత్రాలపైనా ఇదే పెన్నుతో రిషి సంతకాలు చేశారు.
ఈ ఎరేజబుల్ ఇంక్ పెన్నుల విషయంపై బ్రిటన్ ప్రధాని కార్యాలయం అయిన 10 డౌనింగ్ స్ట్రీట్ వర్గాలు స్పందించాయి. అధికారిక పత్రాలు అన్నింటిని ప్రధాని రిషి సునాక్ తనకు భద్రంగా ఉంచుతారని పేర్కొన్నాయి. ఇలాంటి పెన్నులను సివిల్ సర్వీస్లో అధికారులు ఎక్కువగా ఉపయోగిస్తారని.. రిషి సునాక్ మీడియా కార్యదర్శి వెల్లడించారు. ఇలాంటి పెన్నులతో రాసిన రాతలను.. ప్రధాని రిషి సునాక్ ఎప్పుడూ చెరిపివేసే ప్రయత్నం చేయలేదని.. భవిష్యత్తులో కూడా అలా చేయరని తెలిపారు.
ఇంత వివాదాస్పదం అవుతున్న ఈ పెన్ను ధర బ్రిటన్ రిటైల్ మార్కెట్లో 4.75 పౌండ్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.495 అన్నమాట.