Donkey Route :54 మంది భారతీయులను బహిష్కరించిన అమెరికా
డంకీ రూట్లో ప్రవేశమే కారణం
అమెరికాలో వలసలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం కఠినచర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ వలసలు ఆగడం లేదు. డంకీ మార్గం లో తమ దేశంలోకి ప్రవేశించారనే ఆరోపణలతో 54 మంది భారతీయులను అమెరికా తాజాగా వెనక్కిపంపింది. అందులో అత్యధికంగా హర్యాణా వాసులే కావడం గమనార్హం.
16 మంది కర్నాల్ యువకులు కాగా, 15 మంది కైతాల్కు చెందిన వారు. అంబాలా (5), యమునా నగర్ (4), కురుక్షేత్ర (4), జింద్ (3), సోనిపట్ (2), పంచకుల, పానిపట్, రోహ్తక్, ఫతేహాబాద్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. వారంతా ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. బహిష్కరణకు గురైన వారు 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నవారే నని చెప్పారు. వారందరినీ కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు. వీరంతా అక్రమమార్గమైన డంకీ రూట్ ద్వారా అమెరికాలోకి ప్రవేశించినట్లు కర్నాల్ డీఎస్పీ సందీప్ కుమార్ తెలిపారు. కాగా, ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించి స్వదేశాలకు పంపుతున్నారు. ఈ ఏడాది వేల సంఖ్యలో అక్రమవలసదారులను దేశం నుంచి బహిష్కరించారు.