Monkeypox : ప్రపంచాన్ని వణికిస్తోన్న మంకీపాక్స్
భారత్లో వ్యాపించే ప్రమాదం ఉందా;
కరోనా తో కకావికలమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ సాధారణ స్థితికి రాలేదు. ఇలాంటి సమయంలో ‘మంకీపాక్స్’ రూపంలో మరో వైరస్ కలకలం సృష్టిస్తున్నది. 1958లో గుర్తించిన ఈ వైరస్ కొత్తది కానప్పటికీ, మ్యుటేషన్తో కొత్త శక్తిని సంతరించుకోవడం భయపెడుతున్నది.
కాంగో సహా ఆఫ్రికాలోని పలు దేశాలలో విస్తరిస్తున్న ప్రాణాంతకమైన ఎంపాక్స్ (మంకీపాక్స్) వ్యాధి తీవ్రతను గమనించి అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ఓ).
ఎంపాక్స్ ప్రభావిత దేశాలు సమర్పించిన డేటాను సమీక్షించిన అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల (ఐహెచ్ఆర్) నిపుణుల కమిటీ సూచనలకు అనుగుణంగా ఆగస్టు 14న ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనమ్ గేబ్రియేసిస్ ఈ ప్రకటన చేశారు.
ఆఫ్రికాలో మాత్రమే కనిపించే మంకీపాక్స్ వైరస్ స్వీడన్, పాకిస్థాన్కూ విస్తరించింది. గతంలో నమోదైన మంకీపాక్స్ కేసులు పశ్చిమ ఆఫ్రికా క్లాడ్ వేరియంట్ (క్లాడ్-2) రకానికి చెందినవి. తీవ్రత తక్కువ ఉండేది. ఇప్పుడు నమోదవుతున్న కేసులు క్లాడ్-1 (కాంగోబేసిన్ క్లాడ్) రకానికి చెందినవిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్ సోకితే మరణాల రేటు 10% వరకూ ఉండొచ్చు.
కరోనా విలయం మునుపు 2020లో గ్లోబల్ జీడీపీ వృద్ధిరేటు 2.5% మేర పెరుగుతుందని ప్రపంచబ్యాంకు 2019లో అంచనా వేసింది. అయితే, కొవిడ్ కేసులు, లాక్డౌన్తో జీడీపీ వృద్ధిరేటు 3.1 శాతం మేర పడిపోయింది. ఇప్పుడూ ఎంపాక్స్ కేసులతో అదే పరిస్థితి రావొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి సమయం పట్టినట్లే, మంకీపాక్స్ టీకాలకు సమయం పట్టొచ్చని గుర్తు చేస్తున్నారు.
మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తిని కట్టడి చేసి, నిరోధించేందుకు ముందు జాగ్రత్త చర్యలను చేపట్టినట్టు కేంద్రం పేర్కొన్నది. దేశంలో కొత్తగా మంకీపాక్స్ కేసులు నమోదు కాలేదని ఆరోగ్య శాఖ తెలిపింది. ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నేతృత్వంలో శనివారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది.