"గడపగడప"లో ఉద్రిక్తత.. మహిళలపై వైసీపీ కార్యకర్తల దాడి
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనివాసపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గడపగడపకు కార్యక్రమంలో భాగంగా శనివారం ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి దాచేపల్లిలో పర్యటించారు. కాసు మహేశ్రెడ్డిని పలువురు తమ గోడును వెళ్లబోసుకున్నారు. మౌలిక సదుపాయాలు బాలేవని విన్నవించుకున్నారు. ఎమ్మెల్యేనే ప్రశ్నిస్తారా అంటూ ఆయన అనుచరులు స్థానికులపై దాడి చేసారు.
గడపగడపకు కార్యక్రమంలో ప్రశ్నించిన మహిళలపై వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. కర్రలు, గొడ్డల్లు, రాళ్లతో ఇష్టానుసారంగా దాడి చేసారు. పలువురి నివాసాలపై రాళ్లు విసిరారు. ఇళ్లల్లోకి చొచ్చుకెళ్లి లక్షల నగదు దోచుకెళ్లినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే కాసు మహేశ్రెడ్డిని రోడ్డు బాగోలేదని స్థానిక మహిళలు ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే వెనుతిరిగిన వెంటనే ఈ దాడులకు పాల్పడ్డారు. అయితే ఇదంతా స్థానిక పోలీసుల కనుసన్నల్లో జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com