ఎమ్మెల్యే కేతిరెడ్డి భూకబ్జా బట్టబయలు చేసిన లోకేష్‌

ఎమ్మెల్యే కేతిరెడ్డి భూకబ్జా బట్టబయలు చేసిన లోకేష్‌
ధర్మవరం సమీపంలోని ఎర్రగుట్టను కేతిరెడ్డి ఆక్రమించి విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని ఆరోపణ

యువగళం పాదయాత్ర చేస్తోన్న లోకేష్‌ ఎక్కడికి వెళ్లినా..అక్కడి వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి బాగోతాన్ని బయటపెడుతూ అధికారపార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఇప్పటికే పెనుగొండ, రాప్తాడులో పర్యటించి అక్కడి వైసీపీ ఎమ్మెల్యేల అవినీతిని, భూదందాను ఎండగట్టారు. తాజాగా ఇప్పుడు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి భూకబ్జాను సైతం.. వెలుగులోకి తెచ్చారు. ధర్మవరం సమీపంలోని ఎర్రగుట్టను కేతిరెడ్డి ఆక్రమించి విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మించుకున్నారన్నారని ఆరోపించారు లోకేష్‌. కేతిరెడ్డి ఆక్రమించిన ప్రదేశంలో సెల్ఫీ దిగి ఆయన భూకబ్జాను బయపెట్టారు లోకేష్. గుట్టపై విలాసవంతమైన భవనంతో పాటు అందులో రేసింగ్ ట్రాక్, గుర్రపు స్వారీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారన్నారు. టీడీపి అధికారంలోకి రాగానే కేతిరెడ్డి భూకబ్జాలపై ప్రత్యేక బృందంతో విచారణ చేయిస్తామన్నారు.ఈ మేరకు ప్రకటన రిలీజ్‌ చేశారు లోకేష్‌.

ధర్మవరం రెవెన్యూ పరిధిలోని 902 నుంచి 909 సర్వే నంబర్లలో ఎర్రగుట్ట పైన ఉన్న 15 ఎకరాలను దొంగ పత్రాలు సృష్టించి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కాజేశారని ఆరోపించారు. ఎర్రగుట్టపై భూములను కొట్టేయడానికి అక్రమంగా లింకు డాక్యుమెంట్లు సృష్టించినట్లు తెలిపారు. హైదరాబాదుకు చెందిన ఓ ఫైనాన్స్ కంపెనీ నుంచి ఈ సర్వేనెంబర్ పై రుణాలు తీసుకున్నట్లు డాక్యుమెంట్లు తయారుచేశారన్నారు. రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో వాటిని వేలంలో తమ కుటుంబ సభ్యులు కొన్నట్లు రికార్డులు తయారుచేసి భూములను కొట్టేసినట్లు తెలిపారు. ఎర్రగుట్టపై మరో 5 ఎకరాలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కుటుంబంలోని మహిళ పేరుతో ఆన్లైన్లో నమోదు చేశారన్నారు. ఇవి పిత్రార్జితంగా సంక్రమించినట్లు రికార్డుల్లో చూపారన్నారు. అయితే ఆమెది కర్నూలు జిల్లా గాక ఇక్కడికి ఇచ్చి వివాహం చేశారని... కర్నూలు జిల్లాకు చెందిన మహిళ తండ్రికి ఇక్కడ గుట్టపై భూమి ఎలా సంక్రమించిందని ప్రశ్నించారు లోకేష్. ఎర్రగుట్టపై ఉన్న సర్వే నంబర్లకు సంబంధించి రికార్డులు సమర్పించాలని RTI ద్వారా అడిగితే వాటికి సంబంధించిన రికార్డులు లేవంటూ సమాధానాలు ఇస్తున్నారన్నారు లోకేష్‌

రికార్డుల్లో లేని భూమి ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పేరుతో ఎలా నమోదు అయిందని ప్రశ్నించారు లోకేష్‌. అలాగే పోతుల నాగేపల్లి పరిధిలోని 42,43 సర్వే నెంబర్లలో అసైన్డ్ భూములను రైతులను బెదిరించి లాక్కోవాలని ప్రయత్నించినట్లు ఆరోపించారు. విషయం ఎస్సీ కమిషన్ వరకు వెళ్లడంతో అప్పటి కలెక్టర్ గంధం చంద్రుడు అడ్డుకున్నారని తెలిపారు. అందుకే ఆయనపై కక్ష పెంచుకుని ఇక్కడి నుంచి బదిలీ చేయించినట్లు కేతిరెడ్డిపై ఆరోపణలు చేశారు లోకేష్‌. టీడీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి భూ అక్రమాలతో పాటు రాష్ట్రంలోని వైసీపీ ఎమ్మెల్యేలందరి అవినీతిపై ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తామన్నారు లోకేష్‌.

Tags

Read MoreRead Less
Next Story