అప్పు చెల్లించడంలేదని మహిళను వివస్త్రను చేసి..
నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. అప్పు చెల్లింపు విషయంలో ఓ వైసీపీ నేత రెచ్చిపోయాడు. తనకే ఎదురు చెబుతావా అంటూ వివస్త్రను చేసి విచక్షణారహితంగా దాడి చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉపయోగం లేకపోవడంతో బాధితురాలు మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాత్నం చేసింది. ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీ, పోలీసుల తీరుపై భగ్గుమంటున్నారు.
నెల్లూరు జిల్లా పొదలకూరుకు చెందిన లక్ష్మీ అనే మహిళ ఏడాది కిత్రం వైసీపీ నేత ప్రభాకర్ వద్ద 10వేల రూపాయలు అప్పు తీసుకుంది. అయితే అప్పు చెల్లించకపోవడంతో మాట్లాడదాం రమ్మని ప్రభాకర్ లక్ష్మీని పిలిపించారు. లక్ష్మీ తన తల్లి అంకమ్మ, అక్క అనసూయతో కలిసి వెళ్లింది. అప్పు చెల్లింపు విషయంలో ప్రభాకర్ లక్ష్మీని అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో ఇదేం పద్దతి అంటూ అనసూయ అడ్డు చెప్పింది. కోపంతో ఊగిపోయిన ప్రభాకర్ అనసూయపై దాడి చేశాడు. గ్రామ సర్పంచ్ భర్త ముందే వివస్త్రను చేశాడు.
ఘటనపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అయితే స్థానిక వైసీపీ నేత విజయ భాస్కర్, సర్పంచ్ భర్త జోక్యంతో పోలీసులు చర్యలు తీసుకోలేదు. పైగా బాధితులపైనే బెదిరింపులకు దిగారు వైసీపీ నేతలు. దీంతో మనస్థాపానికి గురయిన లక్ష్మీ ఆత్మహత్యాత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిని ఆస్పత్రికి తరలించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com