కోడిగుడ్డు తిని చిన్నారి మృతి ఘటనపై హైకోర్టు ఆగ్రహం

ఏపీ ప్రభుత్వ తీరుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలోని గుల్లెపల్లి అంగన్వాడి కేంద్రంలో.. కోడిగుడ్డు తిని చిన్నారి మృతి చెందిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘటనలో అప్పటి అంగన్వాడి సంరక్షకురాలు, అధికారులు తమకేమీ సంబంధం లేదని చెప్పి చేతులు దులుపుకున్నారు. దీంతో మృతుని తల్లిదండ్రులు రాష్ట్ర మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. బాధిత కుటుంబానికి 8 లక్షల పరిహారం అందించాలని అంగన్వాడి టీచర్, కుప్పం తహసీల్దార్, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శికి ఈ ఏడాది జనవరి 31న ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.
ఈ కేసు విచారణ చేపట్టిన హైకోర్టు.. మానవ హక్కుల సంఘం ఇచ్చిన తీర్పును ఏకీభవించింది. వ్యాజ్యం కొట్టివేసింది. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలు వ్యాజ్యాలు వేయకుండా ఉండాల్సిందని.. దీనివల్ల సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వ ప్రతిష్ట దిగజారుగుతుందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అటు అంగన్వాడి కేంద్రంలో జరిగిన ఘటనకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడి టీచర్దే బాధ్యతని వెల్లడించింది. హైకోర్టు తీర్పుపై బాధిత తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. బాధ్యులను శిక్షించాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com