గుండె తరుక్కుపోతుంది: లోకేష్

జగన్ పాలనలో ఒక్కో కుటుంబానికి ఎంత కష్టం వచ్చిందో చూస్తుంటే గుండె తరుక్కుపోతోందన్నారు నారా లోకేష్. యువగళం పాదయాత్రలో భాగంగా మంత్రాలయం నియోజకవర్గం మాధవరం శివార్లలో లోకేష్ను కలిశారు మహిళా రైతు లింగమ్మ. టమోటా పంటను చూపి గోడు వెళ్లబోసుకుంది. తమకు 3 ఎకరాల పొలం ఉంటే ఎకరాలో టమోటా, రెండెకరాల్లో చెరుకు వేశానని.. ఎకరా టమోటా పంటకు 70వేలు ఖర్చయితే 10వేలు రాబడి వచ్చిందని వాపోయారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పంట నష్టం జరిగితే 70వేల పంటల బీమా సొమ్ము వచ్చిందని ఆమె తెలిపారు.
టమోటా రైతులను ఆదుకోవడానికి కెచప్ ఫ్యాక్టరీలు పెడతానన్న జగన్.. పత్తా లేకుండా పోయారని విమర్శించారు లోకేష్. పంటల బీమాకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీ పెడుతుందని చెప్పి అన్నదాతలను నట్టేట ముంచారని ఆరోపించారు. కుటుంబాలన్నీ వలసలు పోతుంటే పల్లె కన్నీరు పెడుతోందన్నారు. ఇంటిల్లిపాదీ మండుటెండల్లో ఉపాధిని వెతుక్కుంటూ వెళ్లి తిరిగి వస్తున్న దృశ్యాలు ఆందోళనకు గురిచేస్తున్నాయని లోకేష్ తెలిపారు. బడిలో చక్కటి రాతలు నేర్చాల్సిన చిట్టి చేతులు మట్టి పనులకి తల్లిదండ్రులతో తరలిపోతున్నారని అన్నారు. మెతుకు కోసం, బతుకు కోసం వందల కిలోమీటర్లు ప్రమాదకర ప్రయాణం చేస్తున్న వలస జీవుల బాధలు అన్నిఇన్ని కాదన్నారు. టీడీపీ ప్రభుత్వం రాగానే యుద్ధప్రాతిపదికన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి వ్యవసాయానికి నీరందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. స్థానికంగానే ఉపాధి దొరికే మార్గాలు చూపుతామని.. వలస కష్టాలు లేకుండా చేస్తామని పేర్కొన్నారు. పల్లె కన్నీరు తుడుస్తామని భరోసా ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com