సీఎం జగన్ బీసీలను నమ్మంచి మోసం చేశాడు : లోకేష్

బీసీలను బ్యాక్ బోన్ అని పొగిడి.. నేడు వాళ్ల బ్యాక్ బోన్ విరిచిన వ్యక్తి సీఎం జగన్మోహన్రెడ్డి అని విమర్శించారు నారా లోకేష్. యువగళం పాదయాత్రలో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరంలో వడ్డెర సామాజిక వర్గీయులు లోకేష్ను కలిశారు. తమ సమస్యలను చెప్పుకున్నారు. టీడీపీ పాలనలో తమకు కులవృత్తి పనిముట్లు అందేవని.. బీసీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయం వచ్చిందన్నారు. గతంలో తమకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని.. కమ్యూనిటీ హాళ్లు నిర్మించారన్నారు. ప్రస్తుతం వైసీపీ పాలనలో తమకు అవేమీ కనిపించడం లేదని.. టీడీపీ అధికారంలోకి వచ్చాక వాటిని పునరుద్ధరించాలని కోరారు.
బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు లోకేష్. టీడీపీ అధికారంలోకి రాగానే.. వడ్డెర్ల నుంచి వైసీపీ నేతలు లాక్కున్న క్వారీలను తిరిగి అప్పగిస్తామని హామీ ఇచ్చారు. విధులు, నిధులు, కూర్చోవడానికి కుర్చీలు కూడా లేని కార్పొరేషన్లు ఇచ్చి జగన్ మోసం చేశారని ఆరోపించారు. కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాన్ని తాము తలపెడితే వైసీపీ నిలిపివేసిందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తి చేస్తామని చెప్పారు. దామాషా ప్రకారం వడ్డెర కర్పొరేషన్కు నిధులు కేటాయించి.. వడ్డెర్లకు గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com