కుప్పకూలిన బహుదా నది వంతెన

శ్రీకాకుళం జిల్లాలో బ్రిటీష్కాలంలో నిర్మించిన బ్రిడ్జి కుప్పకూలింది. ఇచ్ఛాపురం సమీపంలోని బహుదా నదిపై ఉన్న వంతెన ఉదయం ఆరు గంటల సమయంలో విరిగిపడింది. 70 టన్నుల బరువున్న రాళ్ల లోడ్తో ఓ కంటైనర్ వెళ్తుండగా ఒక్కసారిగా వంతెన కూలింది. కంటైనర్ నదిలో పడిపోయింది. డ్రైవర్, క్లీనర్ కంటైనర్ నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. వంతెన కూలిన సమయంలో బ్రిడ్జిపై ఇతర వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
1929లో బహుదా నదిపై ఈ వంతెన నిర్మించారు. ఇచ్చాపురం పట్టణం నుంచి జాతీయ రహదారికి వెళ్లే మార్గంలో ఉన్న బ్రిడ్జి కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బ్రిడ్జి శిథిలావస్థకు చేరిందని అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. వంతెన కూలిన ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com