ఏపీ హజ్ యాత్రికులపై భారం

ఏపీ నుంచి హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు భారీగా భారం పడుతోంది. విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లే ఒక్కొక్కరిపై అదనంగా 83 వేల రూపాయలు వేస్తున్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విమాన టికెట్, ఇతర వసతులకు 3 లక్షల ఐదు వేలు ఉండగా , విజయ వాడ నుంచి మాత్రం అది 3 లక్షల 88 వేల రూపాయలుగా ఉంది. ఇక బెంగళూరు ధరతో పోల్చినా కూడా ఏపీ యాత్రికులపై రెండు వేలు అదనంగా ఉంది. వసతుల కల్పన, ఇతర ఖర్చులకు మూడుచోట్లా రెండు లక్షల వరకు ఉండగా, విమాన టికెట్ ధరలో మాత్రం భారీ వ్యత్యాసం ఉంది.
హైదరాబాద్ నుంచి టికెట్ ధర లక్షా మూడు వేలు ఉండగా, విజయవాడ నుంచి మాత్రం అది లక్ష,88 వేలు ఉంది. రెండ్రోజుల క్రితం కేంద్రం ఈ ధరల్ని ప్రకటించింది. భారీ వ్యత్యాసాలు ఉండటంపై ఏపీ హజ్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అటు ముస్లిం సంఘాలు సైతం దీనిపై మండిపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపిస్తున్నాయి. ఏకంగా 83 వేలు పెంచడమేంటని ప్రశ్నిస్తున్నాయి. ఈ ధరలను తగ్గించాలని కేంద్ర హజ్ కమిటీకి విజ్ఞప్తి చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com