చంద్రగిరి కొత్త శానంబట్లలో వరుస అగ్నిప్రమాదాలు

ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి కొత్తశానంబట్లలో వరుస అగ్నిప్రమాదాలు మిస్టరీగా మారాయి. గ్రామంలో ఒకే కుటుంబానికి చెందినశివశంకర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, రవి, ఈశ్వర్ రెడ్డి, ఆనంద్ రెడ్డిల ఇళ్లు, పంట పొలాల్లో అకస్మాత్తుగా మంటలు వ్యాపిస్తున్నాయి. 20 రోజుల క్రితం శివశంకర్ రెడ్డికి చెందిన గడ్డివాములు 14 రోజుల ప్రసాద్ రెడ్డికి చెందిన నాలుగు గడ్డివాములు, వారం క్రితం రవికి చెందిన ఓ గడ్డివాము, రెండు రోజుల క్రితం ఈశ్వర్ రెడ్డికి మరో గడ్డివాము అకస్మాత్తుగా కాలిపోయాయి.
గత గురువారం మరోసారి ప్రసాద్ రెడ్డి ఇంట్లోని బీరువాలో మంటలు వ్యాపించి బట్టలు, 35వేల రూపాయల నగదు, బంగారం కాలిపోయాయి.ఈ వరుస ఘటనలతో గ్రామంపై క్షుద్రపూజలు ప్రయోగించారని అనుమానించిన గ్రామస్తులు మంత్రగాళ్లను ఆశ్రయించారు.గ్రామం నడిబొడ్డున గంగమ్మకు పూజలు నిర్వహించారు. పూజలు చేస్తుండగా సమీపంలోని తాళం వేసిన మరో ఇంట్లో మంటలు చేలరేగాయి. ఈ మిస్టరీ మంటలతో గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.ఎప్పుడు ఏం జరుగుంతోనని ఆందోళన చెందుతున్నారు.
గత రెండు వారాలుగా జిల్లా యంత్రాంగానికి ఈఘటన సవాలుగా మారింది.జిల్లా యంత్రాంగమంతా దృష్టి సారించేంత సమస్యగా మారింది. జిల్లా కలెక్టర్ తో పాటు ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శానంబట్లలో పర్యటించారు. పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.మరోవైపు సీసీ కెమెరాల నిఘా బయట వ్యక్తులు రాకపోకలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అయినా గ్రామంలో మంటలు మాత్రం ఆగడం లేదు.
మరోవైపు కెమికల్ రియాక్షన్స్ వల్ల జరుగుతోందా లేదా పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల మంటలు చెల్లరేగుతున్నాయన్న కోణంలో ఆరా తీస్తోంది. ఈ మేరకు ఇప్పటికే శాంపిల్స్ సేకరించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు కూడా పంపింది. ఇప్పటి వరకు నివేదిక రాకపోవడంతో మరోసారి శాంపిల్స్ సేకరించింది. ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.అనుమానితులందరినీ విచారించేందుకు కార్టన్ సెర్చ్ ను నిర్వహించారు. గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులను శానంబట్లలో మోహరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com