Yuvagalam: 107వ రోజుకు చేరుకున్న నారా లోకేష్ పాదయాత్ర

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 107వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు 13వందల 63 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి అయ్యింది. ఇవాళ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. లోకేష్ పాదయాత్రకు విశేష స్పందన వస్తుంది. యువనేతకు మద్దతుగా వేలాది మంది జనం పాదయాత్రకు తరలివస్తున్నారు. పాదయాత్రలో భాగంగా మధ్యాహ్నం 2గంటలకు దొర్నిపాడు క్యాంప్ సైట్ లో బలిజ సామాజికవర్గీయులతో ముఖాముఖిలో లోకేష్ పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4గంటలకు దొర్నిపాడు నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. దొర్నిపాడు శివార్లలో స్థానికులతో మాటామంతీ, బస్టాండు వద్ద రైతులతో సమావేశం నిర్వహించనున్నారు.
అనంతరం దొర్నిపాడు కృష్ణదేవరాయ సెంటర్ లో స్థానికులను కలవనున్నారు. అక్కడి నుంచి హెచ్.డబ్ల్యు సెంటర్ వద్దకు చేరుకుని ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశంలో పాల్గొంటారు. ఇక పాదయాత్రగా రామచంద్రాపురం చేరుకుని స్థానికులు, రైతులతో వేరువేరుగా సమావేశం అవుతారు. ఈ సందర్భంగా వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు లోకేష్. అనంతరం పాదయాత్రగా భాగ్యనగరం చేరుకుని అక్కడ స్థానికులతో భేటీ అవుతారు. ఇక చింతకుంట దేవరాయపురంలో స్థానికులతో మాటామంతీ, పెద్ద చింతకుంటలో నరేగా వర్కర్లతో సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల అనంతరం పాదయాత్రగా ఆళ్లగడ్డ అపర్ణ ఇన్ ఫ్రా వెంచర్ వద్ద విడిది కేంద్రానికి చేరుకుంటారు. రాత్రికి లోకేష్ ఇక్కడే బస చేస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com