వచ్చేవారం సుప్రీంలో ఆర్‌5 జోన్‌పై విచారణ

వచ్చేవారం సుప్రీంలో ఆర్‌5 జోన్‌పై విచారణ
కోర్టు కార్యకలాపాలు ప్రారంభం కాగానే ఆర్‌5 జోన్‌పై సీజేఐ ధర్మాసనం ముందు అమరావతి రైతుల తరపు న్యాయవాదులు ప్రత్యేకంగా ప్రస్తావించారు

ఆర్‌5 జోన్‌పై వచ్చే వారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. కోర్టు కార్యకలాపాలు ప్రారంభం కాగానే ఆర్‌5 జోన్‌పై సీజేఐ ధర్మాసనం ముందు అమరావతి రైతుల తరపు న్యాయవాదులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో.. వచ్చేవారం విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. తేదీని ఇంకా ఖరారు చేయలేదు. ఆర్ 5 జోన్లో ఇళ్ల స్థలాల కేటాయింపులో హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని.. రాష్ట్ర ప్రభుత్వ జీవోలను రద్దు చేయాలని రైతులు సుప్రీంను ఆశ్రయించారు. అమరావతి మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా ప్రభుత్వం జీవోలు తీసుకొచ్చిందని రైతులు చెబుతున్నారు. గతంలో రైతులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను ఏపీ హైకోర్టు తిరస్కరించింది.

కోర్టు తుది ఉత్తర్వులకు లోబడి వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విముఖత చూపారు. దీంతో హైకోర్టు ఉత్తర్వులపై రైతులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వలేదని, తగిన ఉత్తర్వులు ఇవ్వాలంటూ గతంలో సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ని కొద్ది రోజుల క్రితం రైతులు వెనక్కి తీసుకున్నారు. హైకోర్టు ఇచ్చే ఉత్తర్వుల ఆధారంగా మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ అమరావతి రైతులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story