ఆర్ 5 జోన్ ఏర్పాటుపై నేడు హైకోర్టులో విచారణ

ఆర్ 5 జోన్ ఏర్పాటుపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. రాజధానిలోబయట వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని హైకోర్టులో రైతులు సవాల్ చేశారు. రాజధానిలో నిర్మించిన టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వకుండా..ఇళ్ల పట్టాల పంపిణీపై అత్యవసరం ఏంటని పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్ళ వ్యవహారంలో అటు ప్రభుత్వం, ఇటు పిటిషనర్లు ఎలాంటి వివరాలు అందజేయలేదు. రాజధాని ప్రాంతంలో నిర్మించిన వేల టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులవివరాలు, ఇళ్ళ మంజూరుకు అనుసరించిన విధివిధానాలు పూర్తి రికార్డులను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది ధర్మాసనం. వాదనలు వినిపించేందుకు సిద్ధమై రావాలని ఇరువైపుల న్యాయవాదులకు హైకోర్టు సూచించింది.
మరోవైపు అమరావతిలోని ఆర్ 5 జోన్లో రాజధానేతర పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా జగన్ సర్కార్ పట్టుదలగా వ్యవహారిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. కోర్టు పరిధిలో ఉన్నా నివాస స్థలాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు టెండర్లను పిలవాలని సీఆర్డీఏను నిర్దేశించింది. దీంతో సీఆర్డీఏ ఉన్నతాధికారులు 50 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచారు. ఇక ప్రభుత్వం రహస్యంగా జీవో ఎంఎస్ 45 ద్వారా ఆర్ 5 జోన్ లోని 1134.58 ఎకరాలలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 24 వేల మంది లబ్ధిదారులకు 584 ఎకరాలు, గుంటూరు జిల్లాకు చెందిన లబ్ధిదారులకు 550 ఎకరాలను కేటాయించారు. దీనిపై రాజధాని రైతులు ఆందోళన చెందారు. తమ నుంచి తీసుకున్న భూముల విషయంలో భూ సమీకరణ ఒప్పందాలు, రాజధాని మాస్టర్ ప్లాన్, సీఆర్డీఏ చట్టాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని హైకోర్టును ఆశ్రయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com