అర్థరాత్రి అబ్దుల్‌ సలాం ఇంటికి మహిళా ఎస్‌ఐ, కానిస్టేబుల్‌

అర్థరాత్రి అబ్దుల్‌ సలాం ఇంటికి మహిళా ఎస్‌ఐ, కానిస్టేబుల్‌

వేధింపులు తాళలేక అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నా.. ఇంకా వారికి సంబంధించిన కుటుంబ సభ్యులపై పోలీసుల వేధింపులు ఆగడం లేదు. అర్థరాత్రి సలాం ఇంటికి పోలీసులు వెళ్లడం తీవ్ర వివాదస్పదమవుతోంది. రాత్రి 10 దాటిన తరువాత నంద్యాలలోని అబ్దుల్‌ సలాం ఇంటికి వెళ్లిన ఓ మహిళా ఎస్‌ఐ, కానిస్టేబుల్‌.. తెల్ల కాగితంపై సంతకం చేయాలంటూ సలాం అత్త మాబున్నీసాపై ఒత్తిడి తెచ్చారు. దీనిపై ఆమె సబ్‌కలెక్టర్‌ కల్పనకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సబ్‌ కలెక్టర్‌.. జరిగిన ఘటనపై డీఎస్పీతో మాట్లాడారు. అర్థరాత్రి సమయంలో సలాం ఇంటికి ఎందుకెళ్లారని ప్రశ్నించారు. చివరకు ఉన్నతాధికారుల ఆదేశంలో పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు.

అర్థరాత్రి సలాం ఇంటికి పోలీసులు వెళ్లడంపై ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తెల్ల కాగితంపై సంతకాలు పెట్టాలని ఒత్తిడి చేసిన సదరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అయితే సలాంకు పరిహారం అందించడంలో భాగంగానే వారి ఇంటికి వెళ్లామని.. బ్యాంక్‌ అకౌంట్‌, ఫోన్‌ నెంబర్‌ సేకరించామని పోలీసులు చెబుతున్నారు. సలాం కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమకు లేదన్నారు.


Tags

Read MoreRead Less
Next Story