AP: మాజీ మంత్రి విడదల రజినిపై ఏసీబీ కేసు

మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజినికి ఏసీబీ షాక్ ఇచ్చింది. వైసీపీ హయాంలో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల ముసుగులో బెదిరించి.. రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై రజినిపై ఏసీబీ కేసు నమోదైంది. ఆమెతో పాటు అప్పటి గుంటూరు ఆర్వీఈవో, ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆమెతో పాటు నాటి గుంటూరు ఆర్వీఈవో, ఐపీఎస్ అధికారి పల్లె జాషువా సహా మరికొందరిప ఏసీబీ కేసు నమోదుచేసింది. లంచం తీసుకోవడం, అనుచిత లబ్ధి కలిగించడం, నేరపూరిత కుట్ర, బెదిరింపు తదితర చర్యలు అవినీతి నిరోధక చట్టంలోని 7,7ఏ, ఐపీసీ 384, 120బీ సహ పలు సెక్షన్లను చేర్చింది.
ఏ1గా విడదల రజినీ
ఈ కేసులో ఏ1గా విడదల రజిని, ఏ2గా ఐపీఎస్ పల్లె జాషువా, ఏ3గా విడదల రజిని మరిది గోపి, ఏ4గా రజిని పీఏ దొడ్డ రామకృష్ణలుగా పేర్కొంది. బెదిరింపులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు తొలుత ఫిర్యాదు అందింది. దీంతో అప్పటికి ఏసీబీ డీజీగా ఉన్న హరీష్కుమార్ గుప్తా విచారణ చేపట్టి.. నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఆయన సిఫార్సు మేరకు ఏసీబీ విచారణకు సర్కారు ఆదేశించింది. దీంతో ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ప్రాథమిక దర్యాప్తులో ఆధారాలు లభించడంతో కేసు నమోదుచేసినట్టు అధికారులు తెలిపారు.
అసలు ఏం జరిగిందంటే.. ?
సెప్టెంబరు 2020లో పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం విశ్వనాథుని కండ్రిక గ్రామంలోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్క్రషర్ యజమానులను పిలిపించిన విడదల రజిని.. విజిలెన్స్ దాడులు జరగకుండా ఉండాలంటే అడబ్బులివ్వాల్సిందేనని బెదిరించారని, రూ.5 కోట్లు డిమాండ్ చేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అప్పటి గుంటూరు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఐపీఎస్ అధికారి పల్లె జాషువా.. తన బృందంతో స్టోన్క్రషర్కు వెళ్లి తనిఖీల పేరుతో హడావుడి చేశారని, ఎవరూ ఫిర్యాదు చేయకుండానే విచారణకు వెళ్లారని, విజిలెన్స్ డీజీ అనుమతి కూడా తీసుకోలేదని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com