MLC: అలపాటి రాజ ఘన విజయం

ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపర్చిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ భారీ విజయం సాధించారు. మొదటి రౌండ్ లెక్కింపుతోనే భారీ మెజారిటీని దక్కించుకున్న ఆయన.. రౌండ్ రౌండ్కు తిరుగులేని ఆధిక్యాన్ని పెంచుకుంటా ఘన విజయం సాధించారు. గట్టి పోటీని ఇస్తారని అందరూ ఊహించిన పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు దారుణంగా ఓటమిపాలయ్యారు. ఏడో రౌండ్ ముగిసే సరికి ఆలపాటి రాజేంద్రప్రసాద్కు 1,18,070 ఓట్లు వచ్చాయి. మొత్తం 2,41,873 ఓట్లు పోలవగా, 21,577 చెల్లని ఓట్లుగా గుర్తించారు. 50 శాతానికి పైగా ఆలపాటి ఓట్లు సాధించడంతో ఆయనను విజేతగా ప్రకటించారు. ఏడు రౌండ్లు ముగిసే సరికి ఆలపాటి 67,252 ఓట్ల మెజారిటీ సాధించారు. ఏడో రౌండ్లో ఆలపాటికి 16,447 ఓట్లు రాగా, పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు 7,251 ఓట్లు వచ్చాయి. దీంతో ఏడో రౌండ్లో ఆలపాటికి 9,196 ఓట్ల ఆధిక్యం లభించింది.
ఇంకా కొనసాగుతున్న లెక్కింపు
ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపర్చిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ భారీ విజయం సాధించినా ఓట్ల లెక్కింపు కొనసాగుతూనే ఉంది. బ్యాలెట్ పద్ధతి కావడం, బరిలో 25మంది అభ్యర్థులు ఉండడంతో లెక్కింపునకు ఎక్కువ సమయం తీసుకుంది. విజేతగా ప్రకటించినప్పటికీ మంగళవారం ఉదయం 10 గంటలకు ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఇక ప్రత్యర్థుల్లో సిటింగ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాత్రమే చెప్పుకోదగ్గ ఓట్లను సాధించగలిగారు. మిగిలినవారికి నామమాత్రంగానే ఓట్లు వచ్చాయి.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు
ఈ ఎన్నికను టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఎమ్మెల్సీ స్థానం కావడంతో ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం కోసం తరచూ సమీక్షలు నిర్వహించి నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజా ప్రతినిధులకు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆలపాటి విజయం నల్లేరుపై నడకలా సాగింది. ప్రతి నియోజకవర్గానికి పార్టీ అధిష్టానం పరిశీలకులను నియమించింది. పకడ్బందీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ప్రజలు ఉన్నారని ఈ ఎన్నికతో తేటతెల్లమైంది. ఆలపాటి లక్ష ఓట్ల మెజారిటీ సాధిస్తారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com