MAHANADU: పసుపు పండుగకు సర్వం సిద్ధం

పసుపు పండుగకు సర్వం సిద్ధమైంది. కడప గడప పూర్తిగా పసుపుమయమైంది. నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న మహానాడుకు తెలుగు దేశం పార్టీ సన్నద్ధమైంది. కడప గడపలో తొలిసారి జరుగుతున్న టీడీపీ మహా వేడుక కోసం నగరంలో భారీ తోరణాలు స్వాగతం పలుకుతున్నాయి. జగన్ గడ్డపై జరిగే ఈ మహా ‘మహానాడు’లో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే ప్రధాన అజెండాగా తీర్మానాలు సిద్ధమవుతున్నాయి. ఇదే వేదికపై నుంచి కూటమి ప్రభుత్వ ఏడాది పాలనా విజయాలను చాటనున్నారు.
కడప నగరంలో నేటి నుంచి మూడు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ మహానాడు జరగబోతోంది. మహానాడు కోసం కడప నగరం పసుపుమయంగా మారింది. కడప శివారులోని పబ్బపురంలో 128 ఎకరాల్లో మహానాడు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. కడప నగరంలో ఎటుచూసినా రోడ్డుకిరువైపులా ఫ్లెక్సీలతో, పార్టీ జెండాలతో నిండిపోయింది. నగరం మొత్తం పండగ వాతావరణం సంతరించుకుంది. కడపలో నిర్వహించే మహానాడు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏర్పాట్లు చేశారు.**
ప్రతినిధుల నమోదుతో ప్రారంభం
ఇవాళ ఉదయం 8.30 గంటలకు ప్రతినిధుల నమోదుతో మహానాడు ప్రారంభం కానుంది. అనంతరం పార్టీ చరిత్రను వివరిస్తూ రూపొందించిన ఫొటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాల్ని ప్రారంభిస్తారు. ఉదయం 10.45కు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళితో మహానాడు లాంఛనంగా ప్రారంభం కానుంది. అనంతరం ఇటీవల మరణించిన నాయకులు, కార్యకర్తలకు సంతాపం ప్రకటిస్తారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నివేదిక, ఉదయం 11.30కి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వాగత ప్రసంగం, పార్టీ జమా ఖర్చులపై కోశాధికారి నివేదిక ఉంటాయి. 11.50కి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com