AP: ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతి

ఆంధ్రప్రదేశ్కు ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించారు. దీనికి భారత పార్లమెంట్ చట్టబద్ధత కల్పించడం విశేషంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు–2026కు పార్లమెంట్ ఆమోదం లభించడంతో ఈ నిర్ణయం అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం, 2024 జూన్ 2 నుంచి అమరావతి రాష్ట్ర రాజధానిగా గుర్తింపు పొందింది. దీంతో గతంలో ప్రతిపాదించిన మూడు రాజధానుల విధానానికి పూర్తిగా ముగింపు పలికినట్టయింది. దేశ చరిత్రలో ఒక రాష్ట్ర రాజధానిని ఖరారు చేస్తూ పార్లమెంట్లో ప్రత్యేకంగా చట్టం తీసుకురావడం ఇదే తొలిసారి కావడం ఈ నిర్ణయానికి మరింత ప్రాధాన్యతను తెచ్చింది. దీని ద్వారా రాజధాని అంశంపై ఉన్న అనిశ్చితి తొలగి, పరిపాలనలో స్థిరత్వం ఏర్పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇక మరో ముఖ్యమైన పరిణామంగా రాష్ట్రానికి సంబంధించిన తాజా అధికారిక మ్యాప్ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మ్యాప్లో అమరావతిని రాజధానిగా స్పష్టంగా చూపించడంతో పాటు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ వివరాలను కూడా పొందుపరిచారు. కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 28కి చేరింది. ఈ కొత్త జిల్లాల సరిహద్దులను కూడా అధికారికంగా నిర్ధారించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా భారత అధికారిక పటంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అప్డేట్ చేయడం గమనార్హం. సర్వే ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం రూపొందించిన ఈ మ్యాప్ ఇకపై దేశవ్యాప్తంగా పరిపాలనా, అధికారిక అవసరాలకు వినియోగించబడనుంది. ఇది రాష్ట్ర పరిపాలనలో ఒక స్పష్టమైన మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు.
ఈ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులు ఈ పరిణామాన్ని ఆనందంతో స్వాగతిస్తున్నారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న స్పష్టత ఇప్పుడు లభించిందని వారు భావిస్తున్నారు. రాజధాని అంశంపై కొనసాగిన అనిశ్చితి తొలగడంతో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతాయని కూడా ఆశాభావం వ్యక్తమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
