Amaravati farmers padayatra: 6వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర

amaravati farmers padayatra: అమరావతి రైతుల మహా పాదయాత్ర 6వ రోజుకు చేరుకుంది. ఈ యాత్రకు ఊరూవాడా కదలింది... ఎక్కడికక్కడ హారతులు పట్టి స్వాగతం పలుకుతున్నారు. ఇవాళ ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించనున్నారు రైతులు. 6వ రోజు పెదనందిపాడు నుంచి పర్చూరు వరకు 13.7 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది.
నిన్న ఐదో రోజు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం గ్రామం నుంచి ప్రారంభం కాగా ప్రత్తిపాడు, అబ్బినేనిగుంటపాలెం, వరగాని మీదుగా పెదనందిపాడు వరకు దిగ్విజయంగా సాగింది. రైతులకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గుమ్మడికాయలతో హారతులు ఇచ్చి... పూలవర్షం కురిపించారు. జగన్ సర్కార్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
రైతుల మహాపాదయాత్రకు మద్దతు రోజు రోజుకూ పెరుగుతోంది. వందలాది మంది ప్రజలు అమరావతి రైతుల వెంట కదం తొక్కారు. పాదయాత్రకు ప్రత్తిపాడు, అబ్బినేనిగుంటపాలెంలో స్థానికులు ఘన స్వాగతం పలికారు. రైతులకు మద్దతు తెలిపేందుకు వచ్చేవారితో పాదయాత్ర మార్గంలో రెండు కిలోమీటర్లకు పైగా జన ప్రవాహం కనిపించింది.
కాకుమాను రైతులు ట్రాక్టర్లతో ర్యాలీగా వచ్చి సంఘీభావం తెలిపారు. సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం కంకణాలపల్లి, మాదల, కట్టమూరు, సత్తెనపల్లి పట్టణం నుంచి వచ్చి మద్దతు తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు సైతం అమరావతి రైతులకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com