రైతులపై రాక్షస క్రీడ

రైతులపై రాక్షస క్రీడ
జగన్ తీరుపై మండిపడుతున్న అమరావతి రైతన్నలు

నమ్మక దోహ్రం.. కుట్ర..అక్కసు..ఈ పదాలు జగన్‌ సర్కార్‌కు సరిగ్గా సరిపోతాయని మండిపడుతున్నారు రాజధాని రైతులు. రాజకీయ లబ్ధి కోసం రాజధాని అమరావతిని సీఎం జగన్‌ పావులా వాడుకొంటున్నారని దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులపైనే రాక్షస క్రీడ ఆడుతున్నారని విమర్శిస్తున్నారు. ఎవరి భూములు ఎవరికిస్తున్నారని నిలదీస్తున్నారు. రాజధాని నిర్మాణానికి భూము లిచ్చిన అసైన్డ్‌ రైతులకు నాలుగేళ్లుగా కౌలు చెల్లించకుండా పబ్బం గడుపు తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఇచ్చిన ప్లాట్లను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నిస్తున్నారు. రైతులు, రైతుకూలీలు, అసైన్డ్‌ రైతులు సమస్యలకు పరిష్కారం చూపాకే సెంటు ప్లాట్లు పంపిణీ చేయాలని తేల్చి చెబుతున్నారు.

మరోవైపు విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాలు కావాలి. గత టీడీపీ ప్రభుత్వం అమరావతిని కట్టలేకపోయింది. మన ప్రభుత్వం వచ్చిన తరువాత బ్రహ్మాండంగా కడతామంటూ అప్పటి ప్రతిపక్ష నే తగా ఉన్న జగన్‌ ఎన్నికల ప్రచార సభలలో నమ్మకంగా చెప్పి అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులంటూ భూములు త్యాగం చేసిన రైతులకు నమ్మక దోహ్రం చేశారని రైతులు విమర్శిస్తున్నారు.

ఇక అమరావతి రైతుల త్యాగాలకు విలువ లేకుండా చేసి, పెయిడ్‌ ఆరిస్టులని రైతులను, శ్మశానం, ఎడారి, ముంపు ప్రాంతమని రాజధాని అమరావతిని అవమానించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధానిలో గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్పితే.. సీఎం జగన్‌ నాలుగేళ్లలో తట్ట మట్టి వేసింది లేదు.ఇప్పుడు ఆర్‌-5 జోన్‌ అంటూ రైతుల భూములను బయటి ప్రాంత పేదలకు ఇళ్ళ స్థలాలుగా పంపిణీ చేస్తూ కొత్త నాటకానికి తెర లేపి ఆ ప్రావత రైతుల నోట్లో మట్టి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం అమరావతిని అభివృద్ధి చేయకుండా నాశనం చేయటమే పనిగా పెట్టుకున్నారని, బాబాయి హత్య కేసు నుంచిప్రజల దృష్టి మరల్చటానికే పేదలకు సెంటు భూమి పంపిణీ తలపెట్టారని ఆరోపిస్తున్నారు. రాజధాని రైతులు, బయటి ప్రాంత పేదల మధ్య గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందటానికి చూస్తున్నారని మండిపడుతున్నారు. గత ప్రభుత్వం ఆర్‌-3 జోన్‌లో కేటాయించిన భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే, తమకూ అభ్యంతరం లేదంటున్నారు. జగన్‌ చేస్తున్న అరాచకాన్ని పట్టాలు తీసుకునే వారు కూడా గమనించాలని అంటున్నారు రైతులు.

అమరావతి మాస్టర్‌ ప్లాన్‌కు విరుద్ధంగా... జగన్‌ సర్కారు ఆర్‌–5 జోన్‌ సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఆయా గ్రామాల పరిధిలోనే స్థలాలు ఇస్తుండగా... ఇక్కడ మాత్రం బయటి వారికి కూడా ఇవ్వాలని నిర్ణయించింది. మొత్తం 46 వేల మందికి సెంటు చొప్పున ఇంటిస్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తోన్నప్పటికీ, ప్రభుత్వం ఇంటి స్థలాల పంపిణీ చేపట్టింది. ఒకవైపు అమరావతిని పూర్తిగా అటకెక్కించిన సర్కారు... మరోవైపు... అక్కడ రాష్ట్రంలోని ఏ ప్రాంత పేదలకైనా ఇంటి స్థలాలు ఇస్తామనడం విచిత్రంగా కనిపిస్తోందని అంటున్నారు.సెంటు స్థలం వెనుక మరో వ్యూహం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. యువనేత లోకేశ్‌ను ఓడించాలనే లక్ష్యంతోపాటు... రాజధాని ప్రాంత వాసులు మూడు రాజధానులకే ఓటు వేశారని చెప్పడమే జగన్‌ కుట్రలా కనిపిస్తోందని అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story