AMARAVATHI: భారత సాంకేతిక విప్లవానికి కేంద్రంగా అమరావతి

భారతదేశం సాంకేతిక విప్లవం దిశగా మరో కీలక మలుపు తిరుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రబిందువుగా మారుతోంది. ఒకప్పుడు పచ్చని వ్యవసాయ భూములతో విస్తరించి ఉన్న తుళ్లూరు ప్రాంతం ఇప్పుడు భవిష్యత్తు సాంకేతిక ప్రపంచానికి నిలయంగా మారే దిశగా అడుగులు వేస్తోంది. ప్రపంచం నేడు ఐటీ యుగాన్ని దాటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక రంగాల వైపు పయనిస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతిలో ఏర్పాటు కానున్న “క్వాంటం వ్యాలీ” కేవలం ఒక టెక్నాలజీ ప్రాజెక్టు మాత్రమే కాదు, భారతదేశ భవిష్యత్తు సాంకేతిక సామర్థ్యాలను మలిచే కేంద్రంగా అవతరించే అవకాశాన్ని కలిగి ఉంది. దేశాన్ని గ్లోబల్ టెక్నాలజీ మ్యాప్లో మరింత బలంగా నిలబెట్టే దిశగా ఈ ప్రాజెక్టు ఒక గేమ్ ఛేంజర్గా నిలుస్తుందనే అభిప్రాయం టెక్నాలజీ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొనడం ఈ ప్రాజెక్టుకు ఉన్న ప్రాధాన్యతను స్పష్టం చేసింది. కేంద్రం మరియు రాష్ట్రం కలిసి భవిష్యత్తు సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనే సంకల్పానికి ఇది నిదర్శనంగా నిలిచింది. భారతదేశం కేవలం ఐటీ సేవలకే పరిమితం కాకుండా అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణల కేంద్రంగా ఎదగాలని భావిస్తున్న నేపథ్యంలో అమరావతి క్వాంటం వ్యాలీ ప్రారంభం ఒక చారిత్రాత్మక అడుగుగా చెప్పుకోవచ్చు.
క్వాంటం కంప్యూటింగ్ అనేది సాధారణ కంప్యూటర్లకు పూర్తిగా భిన్నమైన సాంకేతికత. సంప్రదాయ కంప్యూటర్లు బిట్ల ఆధారంగా పని చేస్తే, క్వాంటం కంప్యూటర్లు క్యుబిట్ల ఆధారంగా పని చేస్తాయి. ఈ సాంకేతికత వల్ల క్లిష్టమైన సమస్యలను అత్యంత వేగంగా పరిష్కరించే సామర్థ్యం ఏర్పడుతుంది. ఔషధ పరిశోధనలు, వాతావరణ అంచనాలు, సైబర్ సెక్యూరిటీ, క్రిప్టోగ్రఫీ, ఫైనాన్షియల్ మోడలింగ్, మెటీరియల్స్ సైన్స్ వంటి అనేక రంగాల్లో క్వాంటం కంప్యూటింగ్ విప్లవాత్మక మార్పులకు దారి తీస్తుందని ప్రపంచం ఇప్పటికే గుర్తించింది. ఈ నేపథ్యంలో భారతదేశంలో పూర్తి స్థాయి క్వాంటం టెక్నాలజీ హబ్ను ఏర్పాటు చేయడం ఎంతో కీలకమైన నిర్ణయం. అమరావతి క్వాంటం వ్యాలీ కూడా అదే లక్ష్యంతో రూపుదిద్దుకుంటోంది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ ఐటీ విప్లవానికి కేంద్రంగా మారినట్లే, అమరావతిని క్వాంటం టెక్నాలజీ రంగంలో ప్రపంచంలోని అగ్రగామి కేంద్రాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే 50 ఎకరాల భూమిని కేటాయించారు. ఇందులో ప్రధాన భవనాన్ని సుమారు 45 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. నిర్మాణంలో కూడా అత్యాధునిక సాంకేతికతను వినియోగించడం విశేషం. 3డీ ప్రింటింగ్ మరియు ప్రీ–ఇంజినీర్డ్ టెక్నాలజీతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. ఇది కేవలం ఒక టెక్ పార్క్ కాకుండా పరిశోధన, ఆవిష్కరణలు, శిక్షణ స్టార్టప్ల అభివృద్ధి కేంద్రంగా మారనుంది.
ఈ ప్రాజెక్టులో ప్రపంచస్థాయి టెక్నాలజీ సంస్థలు భాగస్వామ్యం కావడం మరింత ప్రాధాన్యతను తీసుకువచ్చింది. IBM, TCS, L&T వంటి దిగ్గజ సంస్థలు అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించనున్నాయి. IBM మరియు TCS కలిసి ఇక్కడ ప్రత్యేకంగా క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు.క్వాంటం కంప్యూటింగ్ అల్గారిథమ్స్, అప్లికేషన్లు మరియు కొత్త సాంకేతిక పరిజ్ఞానాలపై పరిశోధనలు జరగనున్నాయి. దేశంలోనే కాకుండా ఆసియా ప్రాంతంలో ప్రముఖ పరిశోధనా కేంద్రంగా ఎదిగే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
