Amaravati: అమరావతి పాదయాత్రపై బొత్స వ్యాఖ్యలకు కౌంటర్లు

Amaravati : అమరావతి రైతుల మహాపాదయాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.. బొత్స వ్యాఖ్యలపై అమరావతి రైతులు భగ్గుమంటున్నారు.. మీ బెదిరింపులకు బెదిరేది లేదంటూ తెగేసి చెప్తున్నారు.. పాదయాత్ర ఆపి చూడండి ఏం జరుగుతుందో తెలుస్తుందంటూ ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు.. పాదయాత్రను ఆపితే ప్రజలే మిమ్మల్ని ఇరగదీస్తారంటూ బొత్స సహా నిన్న విశాఖ రౌండ్ టేబుల్ మీటింగ్లో విమర్శలు చేసిన వారందరికీ సమాధానం ఇస్తున్నారు.. రాజధాని ఒక్క అమరావతి రైతుల ఆకాంక్ష కాదని, ఐదు కోట్ల ఆంధ్రుల గుండె చప్పుడని నినదిస్తున్నారు.
ఉత్తరాంధ్రకు ఏదో చేస్తున్నట్లు మంత్రి బొత్స మాట్లాడటం దివాలాకోరు తనానికి నిదర్శనమంటూ అమరావతి రైతులు మండిపడుతున్నారు.. మూడున్నరేళ్లలో ఉత్తరాంధ్రకు జగన్ సర్కార్ చేసిందేంటో నిన్నటి విశాఖ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న నేతలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అమరావతిపై బురద చల్లేందుకు ప్రతిపక్షంలో ఉన్పటి నుంచి కుట్రలు చేస్తూనే ఉన్నారని.. ఇకనైనా ఇలాంటి మాటలు మాట్లాడటం మానుకోవాలని బొత్స సత్యనారాయణకు అమరావతి రైతులు హితవు పలికారు.
అటు అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు టీడీపీ నేతలంతా వెళ్లి మద్దతు తెలుపుతున్నారు.. పాదయాత్ర ప్రస్తుతం దెందులూరు నియోకజర్గంలో జరుగుతోంది.. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి జవహర్, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తోపాటు పలువురు టీడీపీ నేతలు రైతులకు సంఘీభావంగా వారి వెంట కదిలారు.. అమరాతే రాజధానిగా ఉండాలన్న ఏకైక లక్ష్యంతో రైతులు మహోద్యమం సాగిస్తుంటే మంత్రులు కుట్రలతో పబ్బం గడుపుకుంటున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com