రైతు నాయకురాలు శైలజను ఈడ్చుకెళ్లి వ్యాన్ ఎక్కించిన పోలీసులు

అమరావతిలో రైతుల పోరాటం ఉధృతంగా సాగుతోంది. వరుస నిరసనలతో రాజధాని గ్రామాలు హోరెత్తుతున్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతి మహిళా రైతులు చేపట్టిన ర్యాలీ.. పోలీసుల ఆంక్షలతో ఉద్రిక్తంగా మారింది. అమరావతి పరిరక్షణ నినాదంతో దుర్గమ్మను దర్శించుకునేందుకు ర్యాలీగా బయల్దేరిన రైతుల్ని ప్రకాశం బ్యారేజ్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రైతు నాయకురాలు శైలజను ఈడ్చుకెళ్లి వ్యాన్లో ఎక్కించారు. పోలీసుల తీరుకు నిరసనగా బ్యారేజ్నుంచి దూకేందుకు మహిళలు యత్నించారు.
అటు.. పోలీసుల వైఖరిపై మహిళా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అమ్మవారిని దర్శనం చేసుకుని.. నైవేద్యం సమర్పించాలని భావించిన మహిళలు.. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ప్రసాదాన్ని మందడం దీక్షా శిబిరం వద్దకు తీసుకెళ్లారు. భక్తులకు ప్రసాదం పంచి పెట్టాలని భావించారు. కానీ.. ప్రసాదాన్ని పోలీసులు కాలుతో తన్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రసాదాన్ని ఎందుకు తన్నారంటూ.. డీఎస్పీ వెంకటేశ్వరరావును మహిళలు నిలదీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com