AMRAVATHI: నాలుగేళ్ల నరకంలో నవనగరం

ఒక రాష్ట్రం-ఒక రాజధాని అంటూ నినదించి.. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలని చాటిచెప్తూ చేపట్టిన నిరసనోద్యమం మొదలై ఇవాల్టితో 1300 రోజులు.ఈ సందర్భంగా అమరావతి జేఏసీ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది. ఇవాళ మందడం శిభిరంలో నాలుగేళ్ల నరకంలో నవనగరం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.అమరావతి రాజధాని ఐక్యకార్యాచరణ సమితి, అమరావతి పరిరక్షణ సమితి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నాయి. రాజకీయాలు, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అమరావతికి అండగా నిలవాలని వివిధ పార్టీల నాయకులను అమరావతి జేఏసీ నేతలు ఆహ్వానించారు. అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగాలంటూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్న రైతులు, మహిళలు నిన్న ఆలయ ప్రదర్శన యాత్ర నిర్వహించారు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలోని వెంకటేశ్వరస్వామి దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై కనక దుర్గమ్మ ఆలయం, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా తమ ఉద్యమం ఆగదంటున్నారు అమరావతి రైతులు.
ఐదు కోట్ల ఆంధ్రుల ఏకైక రాజధానిగా అమరావతికి సంపూర్ణంగా కట్టుబడి ఉన్నానని అప్పటి ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ అసెంబ్లీలో గొప్పలు చెప్పారు.కానీ అధికారంలోకి రాగానే ఒక్కసారిగా మాట తప్పి మడమ తిప్పేసారు. ప్రజావేదిక కూల్చివేత నుంచే అమరావతిపై కుట్ర పన్ని, కక్ష కట్టారు. రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ జగన్ 2019 డిసెంబర్ 17న విద్వేష ప్రకటన చేశారు. ఆ రోజు నుంచి మొదలైందీ అమరావతి ఉద్యమం. నీరోని మించి అమరావతిపై జగన్ కుతంత్రాలకు తెరలేపి నిరంకుశ వైఖరితో విధ్వంసాలు సృష్టించారు. అంతటితో ఆగలేదు. అడుగడుగునా అమరావతిని విధ్వంసం చేయడమే టార్గెట్కు పెట్టుకున్నారు. అమరావతి ఉద్యమంపై విద్వేషం కక్కుతూనే ఉన్నారు. న్యాయం కోసం సచివాలయం వెళ్లినా కొట్టారు. గుడికి వెళ్లినా కొట్టారు. రైతులని చూడలేదు.ఆడవాళ్లపైనా దాష్టీకాలు ఆపలేదు. నిరసన చేస్తుంటే నిర్బంధించారు.గొంతెత్తితే కేసులు పెట్టారు. అత్యంత శాంతియుతంగా సాగుతున్న ఉద్యమంలో రైతులు, మహిళలు, వృద్ధులతో కంటతడి పెట్టించారు. రాజధాని రాదేమోనన్న ఆందోళన, భయం, బెంగతో ఓవైపు ప్రాణాలు పోతున్నా సరే.. గుండె నిబ్బరంతో అమరావతి ఉద్యమానికి ఊపిరిలూదారు.
2020 జనవరి 5న తుళ్లూరు నుంచి మందడం వరకు సాగిన 29 గ్రామాల రైతుల పాదయాత్రతో ఉద్యమం ఊపందుకుంది. అదే సమయంలో ఇంద్రకీలాద్రిలో ముడుపులు చెల్లించేందుకు బయల్దేరిన మహిళలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో రైతులు, మహిళలు హైవే దిగ్బంధించారు. చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. సరిగ్గా అదే సమయంలో కరోనా వచ్చి, లాక్డౌన్ పెట్టినా సరే రైతులు, మహిళలు వెనక్కి తగ్గలేదు. ఇళ్లల్లోనే ఉద్యమం నడిపారు. అమరావతిలోనో, రాష్ట్రంలోనో కాదు ప్రపంచవ్యాప్తంగా 250 పట్టణాల్లో సంఘీభావ కార్యక్రమాలు చేపట్టారు. రాజధాని రైతులు చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా ప్రవాసాంధ్రులు ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత నారీ-సమరభేరి, రైతు భేరి, న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో హైకోర్టు నుంచి తిరుపతికి సుదీర్ఘ పాదయాత్ర ఇలా వరుస కార్యక్రమాలు చేపడుతూ ఉద్యమాన్ని కొనసాగించారు అమరావతి రైతులు. భగభగమండే ఎండల్లోను, జోరు వానలోను, గడ్డకట్టే చలిలోను అడుగులు తడబడలేదు. వైసీపీ నేతలు కక్షకట్టినా కుతంత్రాలతో కవ్వింపు చర్యలతో రెచ్చగొట్టినా వెరవలేదు. మహిళలని చూడకుండా ఇబ్బందులకు గురిచేసినా అమరావతి పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. రాజధాని అమరావతికి వ్యతిరేకంగా కోర్టు మెట్లు ఎక్కుతున్న ప్రతిసారీ వైసీపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. బహుషా దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో ఇన్ని చివాట్లు పడలేదు అనుకోవచ్చు.
రాజధాని అమరావతిపై అనేక కుట్రలకు దిగింది వైసీపీ సర్కారు. సీఆర్డీయే మాస్టర్ ప్లాన్కు తూట్లు పొడుస్తూ నిర్ణయాలు తీసుకుంది. ఆర్-3 జోన్లో ఐదు శాతం పేదల ఇంటి స్థలాల కోసం రిజర్వ్ చేసి ఉంచినా దాన్ని పట్టించుకోకుండా ఆర్-5 జోన్ను తీసుకొచ్చింది. ఇందులో పేదల ఇళ్ల పేరుతో రాజధానేతర ప్రాంతాలకు చెందిన 47వేల మందికి ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఆర్-5 జోన్ను వ్యతిరేకిస్తూ రైతులు, మహిళలు ప్రజా చైతన్య పాదయాత్ర చేపట్టారు. రైతులపై పోలీస్ జులంతో.. తం పంతం నెగ్గించుకుంది జగన్ సర్కారు. హడావుడిగా పట్టాల పంపిణీ చేపట్టింది. కోర్టు తీర్పునకు లోబడి పేదలకు పట్టాలు ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చినా ఇళ్ల నిర్మాణాల పేరుతో ప్రభుత్వం ఇప్పటికీ హడావుడి చేస్తోంది. అయితే. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా తమ పోరాటం ఆగదని అమరావతి రైతులు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com