ANAKAPALLI: అనకాపల్లిలో 3 వేల ఎకరాల్లో బార్క్ భారీ క్యాంపస్

భారత అణుశక్తి పరిశోధనల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశంలో అణు శాస్త్ర పరిశోధనలు, అధునాతన రియాక్టర్ టెక్నాలజీలను బలోపేతం చేసే లక్ష్యంతో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో సుమారు 3,000 ఎకరాల విస్తీర్ణంలో భారీ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని (R&D) ఏర్పాటు చేయనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ఇప్పటికే రెవెన్యూ భూమిని సేకరించారు. దీనికి అత్యంత కీలకమైన 148.15 హెక్టార్ల అటవీ భూమిని బదలాయించేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీ ఇటీవల సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. దీంతో నిర్మాణ పనులకు తొలి అడ్డంకి తొలగిపోయింది. దేశీయంగా అణు ఆవిష్కరణలు, స్వచ్ఛ ఇంధన వనరులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిన తరుణంలో ఈ కేంద్రం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది రియాక్టర్ల అభివృద్ధి, నూతన ఇంధన సాంకేతికతలలో బార్క్ పాత్రను మరింత విస్తరిస్తుంది. కాగా, బార్క్ ఇప్పటికే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల (SMRs) డిజైన్ పనులను ప్రారంభించింది.
ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే 1,200 హెక్టార్లకు పైగా రెవెన్యూ భూమిని సేకరించారు. దీనికి అదనంగా అవసరమైన 148.15 హెక్టార్ల అటవీ భూమిని బదలాయించేందుకు బార్క్ చేసిన ప్రతిపాదనకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలోని నిపుణుల కమిటీ ఇటీవల సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు ప్రణాళికలో ఈ అటవీ భూమి అత్యంత కీలకం కావడంతో, ఈ అనుమతితో పనులకు తొలి అడ్డంకి తొలగిపోయింది. దేశీయంగా అణు ఆవిష్కరణలు, స్వచ్ఛ ఇంధన వనరులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. అణు పరిశోధనలు, రియాక్టర్ల అభివృద్ధి, నూతన ఇంధన సాంకేతికతలలో బార్క్ విస్తరిస్తున్న పాత్రకు ఈ కొత్త క్యాంపస్ ఊతమిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
ఇప్పటికే భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల (SMRs) డిజైన్, అభివృద్ధి పనులను బార్క్ ప్రారంభించిందని కేంద్రం ఈ మధ్యే పార్లమెంటుకు తెలియజేసింది. మరోవైపు, రష్యాకు చెందిన రోసటామ్తో కలిసి చిన్న, పెద్ద అణు విద్యుత్ ప్రాజెక్టులపై సహకారం కోసం భారత అణుశక్తి విభాగం చర్చలు జరుపుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

