JAGAN: జగన్‌పైకి దూసుకొచ్చిన రాయి..నుదిటిపై గాయం

JAGAN: జగన్‌పైకి దూసుకొచ్చిన రాయి..నుదిటిపై గాయం
సీఎం సిద్ధం పర్యటనలో ఘోర భద్రతా వైఫల్యం... సందేహాలు వ్యక్తం చేస్తున్న ప్రముఖులు...

ముఖ్యమంత్రి జగన్‌కి ఎడమ కంటి పైభాగంలో నుదుటిపై గాయమైంది. గుర్తుతెలియని వ్యక్తి రాయి విసరడం వల్లే గాయమైందని పోలీసులు భావిస్తున్నారు. శనివారం రాత్రి విజయవాడలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో ఉండగా ఈ ఘటన జరిగింది. ముఖ్యమంత్రికి భారీ భద్రత ఉన్నప్పటికీ.... రాయి విసిరి, గాయం చేయగలిగారంటే.. భద్రతాపరంగా పోలీసులు ఎంత ఘోర వైఫల్యం చెందారనేది స్పష్టమవుతోంది.


విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం పరిధిలోని సింగ్‌నగర్‌లో గంగానమ్మ గుడి దగ్గర వైకాపా ఎమ్మెల్సీ రుహుల్లా నివాసానికి అతి సమీపంలోని ఓ ప్రైవేటు స్కూల్‌ వద్ద సీఎం జగన్‌ బస్సు యాత్ర సాగుతుండగా ఆయనపై రాయి పడింది. అప్పుడు ఆ ప్రాంతంలో విద్యుత్తు సరఫరా లేదు. సీఎం పక్కనే ఉన్న వైకాపా సెంట్రల్‌ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్‌కూ రాయి తగిలి స్వల్ప గాయమైనట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రికి ఆయన బస్సులోని వైద్యులు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ప్రచారం కొనసాగించారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో శనివారం రాత్రి యాత్ర ముగిసిన తర్వాత.. భారతీరెడ్డి అక్కడకు చేరుకున్నారు. అనంతరం వారిద్దరూ కలిసి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు, చికిత్స అనంతరం మళ్లీ కేసరపల్లిలోని శిబిరానికి చేరుకున్నారు. సీఎం జగన్‌కు గాయం కావడంతో ఆయన విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించినట్లు వైకాపా వర్గాలు తెలిపాయి. దీంతో జగన్‌ బస్సు యాత్రక ఆదివారం విరామం ప్రకటిస్తున్నామని పేర్కొన్నాయి.

ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ , సీఎం సెక్యూరిటీ గ్రూపు , క్లోజ్‌ ప్రాక్సిమిటీ గ్రూప్, ఎస్కార్ట్, ఇన్నర్‌ కార్డన్, అవుటర్‌ కార్డన్, పెరిఫెరీ ఇలా వందల మందితో ముఖ్యమంత్రికి భద్రత ఉంటుంది. వీళ్లు కాకుండా ఎక్కడికక్కడ స్థానిక పోలీసులు కల్పించే భద్రత అదనం. అయినా సీఎంపైకి రాయి విసిరి, గాయం చేయగలిగారంటే.. భద్రతాపరంగా పోలీసులు ఎంత ఘోర వైఫల్యం చెందారో అర్థమవుతుంది. దాడి జరిగిన ప్రాంతానికి పోలీసుస్టేషన్‌ 2 కిలోమీటర్ల దూరం, సీపీ ఆఫీసు 8 కిలోమీటర్ల దూరం, డీజీపీ ఆఫీసు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉండగా... ప్రొటోకాల్‌ పరంగా రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉన్న సీఎంపై దాడి జరగడం ఘోర భద్రతా వైఫల్యంగా భావిస్తున్నారు. భద్రతా ప్రొటోకాల్స్‌ ప్రకారం... సాధారణంగా ముఖ్యమంత్రి పర్యటన సాగుతుంటే ఆ ప్రాంతంలో విద్యుత్తు కోత, విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా ముందే చూసుకుంటారు. అదికూడా రాత్రివేళ పర్యటన ఉంటే తప్పనిసరిగా కోతలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ శనివారం సాయంత్రం విజయవాడలో సీఎం పర్యటన సాగుతుంటే.. విద్యుత్తు కోత విధించారు. ఎవరు, ఎందుకు విధించారు? విద్యుత్తుశాఖ ఏఈ, డీఈలు, లైన్‌మెన్‌ ఏం చేస్తున్నారు? విద్యుత్తు సరఫరా లేనప్పుడు ముఖ్యమంత్రిని భద్రతా సిబ్బంది బుల్లెట్‌ప్రూఫ్‌ బస్సు లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టాలి. కానీ అందుకు విరుద్ధంగా సీఎం బస్సు మీద నిలబడటానికి సీఎంఎస్‌జీ ఎలా అనుమతిస్తుంది? విద్యుత్‌ సరఫరా లేనప్పుడు ఫోకస్‌ లైట్లు ఆన్‌ చేసి చుట్టుపక్కల ప్రాంతాల్ని కవర్‌ చేయాలి. కానీ భద్రతా సిబ్బంది అవేవీ చేయలేదు. అత్యంత ప్రముఖుల భద్రతను పర్యవేక్షించే అనుభవజ్ఞులైన ఉన్నతాధికారులు ఈ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story