Andhra Pradesh : ఆంధ్రలో అన్నీ అదానీకే..!
అదానీ గ్రూప్ కంపెనీలు అప్పుల కుప్పగా మారాయంటూ అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ రిసెర్చ్ సంస్థ 'హిండెన్బర్గ్ రిసెర్చ్' ఓ సంచలన నివేదిక విడుదల చేసింది! ప్రమోటర్ల మార్కెట్ మాయాజాలంతో చుక్కలంటిన ఈ గ్రూప్ కంపెనీల షేర్ల ధరలు కుప్పకూలే ప్రమాదం ఉందని.. వాటిలో పెట్టుబడులు ఎంతమాత్రం మంచిది కాదని స్పష్టం చేసింది. దీంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లన్నీ కుప్ప కూలాయి.గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 55 వేల కోట్లు హరించుకుపోయాయి.
మరోవైపు ఆంధ్రాలో అదానీ కోరిందే తడవుగా పోర్టులూ..విద్యుత్తు ఉత్పత్తి సంస్థలూ.. విశాఖ ఉక్కు పరిశ్రమ, రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకూ రిజర్వాయర్లను సీఎం జగన్ రాసి ఇచ్చేస్తున్నారు. రాష్ట్రానికి ప్రముఖులు ఎవరైనా వస్తే సీఎం అపాయింట్మెంట్ తీసుకుని మాత్రమే ఆయనను కలివాలి. కానీ, అదానీకి అలాంటి షరతులేవీ ఉండవని పొలిటికల్ సర్కిల్స్లో టాక్.ఇప్పటికే రాష్ట్రంలోని అత్యంత కీలకమైన గంగవరం, కృష్ణపట్నం పోర్టులు అదానీ వశమైపోయాయి.
కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో ఉన్న 2400 మెగావాట్ల శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్కేంద్ర యాజమాన్య నిర్వహణ బాధ్యతనూ అదానీకే అప్పంచేలా అడుగులు పడుతున్నాయని ఉద్యోగ సంఘాలూ .. ప్రజా సంఘాలూ ఆరోపిస్తున్నాయి. గంగవరం పోర్టుకు సమీపంలోనే విశాఖ ఉక్కు ఉంది.. దీంతో తన పోర్టు నుంచి ఇనుప ఖనిజ దిగుమతులు, ఉత్పత్తుల ఎగుమతుల కోసం ఈ పరిశ్రమను స్వాధీనం చేసుకునేందుకు అదానీ పావులు కదుపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉక్కు పరిశ్రమను నిర్వహిస్తున్న 'ఆర్ఐఎన్ఎల్'ను పోస్కో హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని అందరూ చెబుతున్నా .. తెరవెనుక నుంచి అదానీ భారీ స్కెచ్ వేస్తున్నారన్న ప్రచారం బాగా జరుగుతోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com