Andhra Pradesh : పెరిగిన ఆస్తి పన్ను... నేటి నుంచి అమలు

Andhra Pradesh : పెరిగిన ఆస్తి పన్ను... నేటి నుంచి అమలు
X

ఆంధ్ర ప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల్లో పెరిగిన ఆస్తి పన్ను ఇవాళ్టి నుంచి అమలులోకి రానుంది. 2023-24 ఆర్థిక సంవత్సరం పన్ను లక్ష్యంలో దాదాపు 15 శాతం పెరగనుంది. 3 వేల 763 కోట్ల ఆదాయ లక్ష్యంలో... ప్రజలపై భారం దాదాపు 564 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇందుకు సంబంధించి పెరిగిన పన్ను నోటీసులను ప్రజలకు ఇచ్చాకే భారం ఎంతనేది స్పష్టంగా తెలియనుంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గత ఏడాది పెంచిన ఆస్తుల విలువ ప్రకారం.. ఇళ్లు, భవనాల విలువలను మరోసారి లెక్కించి పన్నులు వేస్తే ప్రజలపై భారం మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాలను అధికారులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు.

మూల ధన విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధించే విధానం పుర, నగరపాలక సంస్థల్లో, నగర పంచాయతీల్లో 2021-22 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిపై ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించేందుకు పెరిగిన మొత్తాన్ని ఒకేసారి కాకుండా... ఏడాదికి 15% చొప్పున ఆ మొత్తానికి సమానమయ్యే వరకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత రెండేళ్లలో 15% చొప్పున పన్ను పెంచిన పట్టణ స్థానిక సంస్థలు కొత్త ఏడాది (2023-24)లో మరో 15% పెంచుతున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. మూడు, నాలుగు రోజుల్లో పెరిగిన కొత్త ఆస్తి పన్నుతో డిమాండ్‌ నోటీసులు పురపాలక శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి.

Next Story