Andhra Pradesh : పింఛన్ పంపిణీలో చెత్తపన్ను

ఏపీలో పింఛన్ పంపిణీలో సచివాలయ సిబ్బంది వ్యవహార శైలి వివాదస్పదంగా మారింది. వృద్ధులకు, దివ్యాంగులకు ఇస్తున్న పింఛన్లో చెత్తపన్ను పేరుతో కోతలు విధించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. చెత్తపన్ను మినహాయించుకుని పింఛన్ పంపిణీ చేయడంపై దివ్యాంగులు, వృద్ధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త పన్ను ఇవ్వకపోతే పింఛన్తో పాటు ఇతర ప్రభుత్వ పథకాలను నిలిపివేస్తామని సచివాలయ సిబ్బంది బెదిరిస్తున్నారని పింఛన్ దారులు ఆరోపిస్తున్నారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని 21వ వార్డులో ఈ నెల ఒకటో తేదీ సచివాలయ సిబ్బంది పెన్షన్ నుండి చెత్త పన్ను కట్ చేసి వృద్ధులకు, వికలాంగులకు పంపిణీ చేశారు. పెన్షన్ ఇవ్వక పోతే రేషన్ బియ్యం, ప్రభుత్వ పథకాలు, పెన్షన్ పూర్తిగా ఎత్తివేస్తామని బెదిరించి 700 రూపాయలు చెత్త పన్ను కట్ చేసి పింఛన్ పంపిణీ చేశారని భాస్కర్ అనే దివ్యాంగుడు ఆవేదన వ్యక్తం చేశాడు. మరికొంత మంది వృద్ధులు తమకు పిల్లలు లేరని పెన్షన్లో చెత్తపన్ను కట్ చేశారని వాపోతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com