Ap News : కులగణన ఎన్నికల కోసమేనా

Ap News : కులగణన ఎన్నికల కోసమేనా
సర్వే ఫలితాలు బయటపెట్టని వైసీపీ ప్రభుత్వం

ప్రజల కులం, ఆస్తులు, ఆర్థిక స్థితి వంటి వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి ఉంటే తప్ప.. ప్రభుత్వం మినహా మరెక్కడా ఉండటానికి వీల్లేదు. ఇతరచోట్లకు మళ్లించడం వారి గోప్యత హక్కుకు భంగం కలిగించడమే. ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్‌ ఇదే పని చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కులగణన పేరుతో ఇటీవల ఇంటింటికీ వాలంటీర్లను పంపి సేకరించిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం ప్రకటించకుండానే, వైకాపా చేతికి చేరినట్టు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. వాటి ఆధారంగానే ఈ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థుల ఎంపిక మొదలు ఏ సామాజికవర్గం ఏ ప్రాంతంలో ఎక్కువ ఉంది..? వారిని ఎలా బుట్టలో వేసుకోవాలో లెక్కలు వేసుకుంటోందని తెలుస్తోంది. అందుకే కులగణన వివరాలు బహిర్గతం చేయలేదనేచర్చనడుస్తోంది. సంబంధిత శాఖల అధికారులు మాత్రం సర్వే పూర్తి కాలేదని, ఇంకా 10 శాతం కుటుంబాల వివరాలు సేకరించాల్సి ఉందని చెబుతున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన కారణంగా సర్వేను నిలిపివేసినట్లు పేర్కొంటున్నారు.

దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో కులగణన చేపడుతున్నామని, దాని ఆధారంగా ఆయా సామాజికవర్గాల తలరాతల్ని మార్చేస్తామంటూ జగన్‌ మొదలు, ఆయన వందిమాగధులు డబ్బా కొట్టారు. మొదట గతేడాది నవంబరులో సర్వే చేయాలని నిర్ణయించారు. అప్పుడు చేస్తే తాము అనుకున్న లాభం ఉండదనుకున్నారేమోగానీ వాయిదా వేశారు. ఎన్నికలు సమీపిస్తున్నాయనగా 2024 జనవరి 19న ప్రారంభించారు. కులాలను లెక్కిస్తామని చెప్పి.. ప్రజల ఆస్తులు, విద్యార్హతలు తదితర 20 అంశాలతో కుటుంబాల సమస్త సమచారాన్ని సేకరించారు. తెలంగాణ ప్రభుత్వం గతంలో సమగ్ర కుటుంబ సర్వేను కేవలం ఒక్క రోజులోనే పూర్తి చేసింది. రాష్ట్రంలో మాత్రం 36 రోజుల సుదీర్ఘ సమయం తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి 2 వేల కుటుంబాలకు ఒక గ్రామ, వార్డు సచివాలయం ఉంది. 50 కుటుంబాలకు ఒకరు చొప్పున వాలంటీర్లు ఉన్నారు. అలాంటప్పుడు ప్రభుత్వం అడిగిన వివరాలు సేకరించడానికి 36 రోజులు పడుతుందా.?కులగణన పూర్తి చేయడానికి వైకాపా ప్రభుత్వం మొదట ఇచ్చిన గడువు వారం రోజులే. కానీ ప్రభుత్వం జనవరి 19 నుంచి ఫిబ్రవరి 26 వరకు కొనసాగించింది. ఐనా మరో 10 శాతం మేర పూర్తి కాలేదని చెప్పడమంటే బుకాయించడమే. ప్రభుత్వ సర్వే ప్రకారం.. 22 లక్షల 76 వేల మందితో రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న జిల్లాగా కర్నూలు నిలిచింది. అధిక జనాభా కలిగిన అర్బన్‌ లోకల్‌ బాడీగా 16 లక్షల 27 వేలతో విశాఖపట్నం, నియోజకవర్గ పరంగా 3 లక్షల 82 వేలతో భీమిలి, మండలాల్లో రాజమహేంద్రవరం లక్షా 66 వేలతో మొదటి స్థానాల్లో ఉన్నాయి. 13 వేల 225 మంది జనాభాతో కృష్ణా జిల్లాలోని కానూరు-5 సచివాలయం మొదటి స్థానంలో ఉంది. ఈ వివరాలేవీ బహిర్గతం చేయకుండా గోప్యంగా ఉంచారు.

Tags

Next Story