AP Current : సర్దుబాటు అంటూనే చార్జీల బాదుడు..

AP Current : ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. ఆంధ్రప్రదేశ్లో కరెంట్ ఛార్జీలు బాదుడే బాదుడు అన్నారు జగన్. అధికారంలోకి వచ్చాక బాదుడు ఎలా ఉంటుందో చేతల్లో చేసి చూపిస్తున్నారు. కరెంట్ ఛార్జీలను విపరీతంగా పెంచిన జగన్ సర్కారు.. ఇప్పుడు సర్దుబాటు పేరుతో పేదలపై మోయలేని భారం మోపుతున్నారనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఇలా ఒక నెలో రెండు నెలలో భారం వేయడం కాదు. ఇప్పటి నుంచి 36 నెలలపాటు ప్రజల ముక్కు పిండి మరీ వసూలు చేయబోతున్నారన్న సంకేతాలు ఇచ్చింది.
వచ్చే మూడేళ్ల పాటు కరెంట్ ఛార్జీలపై సర్దుబాటు చార్జీలు తప్పవనే అర్ధం వచ్చేలా.. ఏపీలోని కరెంట్ బిల్లులపై వన్ బై థర్టీ సిక్స్ అనే నెంబర్ కనిపిస్తోంది. దీనర్థం.. ఇకపై ఇళ్ల నుంచి షాపుల వరకు అందరూ 36 నెలల పాటు అదనపు కరెంట్ ఛార్జీలు కట్టాల్సిందేనని చెబుతున్నారు.
ఏపీలో దాదాపు కోటిన్నర ఇళ్లపైనా, 14 లక్షల షాపులపైనా, లక్షన్నర పరిశ్రమలపైనా.. ఈ నెల నుంచి మూడేళ్ల పాటు సర్దుబాటు పేరుతో కరెంట్ ఛార్జీల భారాన్ని వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జులై నెల బిల్లులో 1/36గా రాశారు. 2025 జులై నెల వరకు SPDCL, CPDCL పరిధిలోని వినియోగదారులంతా ఈ భారం మోయాల్సిందేనంటున్నారు.
2014 నుంచి 2019 వరకు విద్యుత్ సరఫరా వ్యయానికి, వాస్తవ వ్యయానికి మధ్య చాలా గ్యాప్ కనిపిస్తోందనే పేరుతో.. ట్రూఅప్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. మొత్తంగా 2వేల 900 కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేయడాన్ని పంపిణీ సంస్థలు ప్రారంభించాయని చెబుతున్నారు.
2014 నుంచి 2019 వరకు.. ఈ ఐదేళ్ల కాలానికి సంబంధించిన సర్దుబాటు ఛార్జీలను మూడేళ్ల తరువాత ప్రజలపై మోపుతోంది జగన్ సర్కార్. దీంతో ఎప్పుడో అద్దెకు ఉండి వెళ్లిపోయిన వాళ్లు కాల్చిన కరెంట్కు.. ఇప్పుడు కొత్తగా అద్దెకు వచ్చిన వాళ్లు కట్టాల్సి ఉంటుంది. అంటే.. సర్దుబాటు కింద ఇకపై ప్రతి నెలా 66 రూపాయలు చెల్లించాల్సి వస్తోందని వినియోగదారులు చెబుతున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

