AP: హెల్మెట్ ధరించకపోతే ఉపేక్షించవద్దు: హైకోర్టు

ఆంధ్రప్రదేశ్లో మోటార్ వాహనాల చట్ట నిబంధనలు సక్రమంగా అమలు కాకపోవడంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రాఫిక్ నిబంధనలు అమలుచేయడంలో పోలీసులు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. మోటారు వాహన చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారన్న సందేశాన్ని ప్రజలకు పంపాల్సిన అవసరముందని హైకోర్టు స్పష్టం చేసింది. రహదారులపై ముమ్మర తనిఖీలు చేసి, నిబంధనలు పాటించని వారికి అక్కడికక్కడే జరిమానాలు విధించాలని, అప్పుడే వాహనదారుల్లో భయం ఉంటుందని వ్యాఖ్యానించింది. పోలీసులు రోడ్డుపై ఉంటే నేరం చేయడానికి సిద్ధపడ్డ వారు కూడా వెనక్కితగ్గడమో, వాయిదా వేయడమో చేస్తారని పేర్కొంది. హెల్మెట్ తప్పనిసరి చేస్తూ తాము ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు చేయడంలేదని పోలీసులను ప్రశ్నించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారనే సందేశాన్ని వాహనదారుల్లోకి బలంగా పంపించాలని సూచించింది.
ముమ్మర తనిఖీలు చేయాల్సిందే
మోటారు వాహన చట్ట నిబంధనల అమలు విషయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం పలు ఆదేశాలు ఇచ్చింది. మోటారు వాహన చట్ట నిబంధనలను అమలు చేయకపోవడంతో ప్రమాదాలు జరిగి, భారీగా మరణాలు సంభవిస్తున్నాయంటూ న్యాయవాది తాండవ యోగేశ్ హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్, జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం.. ట్రాఫిక్ ఐజీ వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. బుధవారం జరిగిన విచారణకు డీజీపీ కార్యాలయం నుంచి ఐజీ ఆకే రవికృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మాసనం.. పోలీసులు క్రియాశీలకంగా వ్యవహరించాలని గుర్తుచేస్తూ హైకోర్టు ధర్మాసనం పలు విషయాలను ప్రస్తావించింది.
హెల్మెట్లు లేకపోతే ఉపేక్షించొద్దు
హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులను ఎంతమాత్రం ఉపేక్షించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. 99 శాతం మంది హెల్మెట్ ధరించకుండానే వాహనాలు నడుపుతున్నారని పేర్కొంది. వాహనాన్ని నడిపే వ్యక్తే కాకుండా వెనుక కూర్చున్నవారు కూడా హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు స్పష్టం చేసింది. మోటార్ వెహికిల్ చట్టంలోని సెక్షన్ 167 ప్రకారం నిర్ధిష్ఠ గడువులోగా చలాన్లను చెల్లించనివారి వాహనాలను ఎందుకు సీజ్ చేయడం లేదని ప్రశ్నించింది. అలాగే చట్టంలోని సెక్షన్ 206 ప్రకారం వాహనదారుల లైసెన్స్లను ఎందుకు రద్దు చేయడం లేదని నిలదీసింది. హెల్మెట్ ధరించని కారణంగా ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబరు వరకు 667 మంది చనిపోయారని, హెల్మెట్ను తప్పనిసరి చేస్తూ తాము ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేసి ఉంటే అందులో కొన్ని ప్రాణాలైనా నిలబడేవని వ్యాఖ్యానించింది. పోలీసులు సీసీ కెమెరాలపై ఆధారపడి చలానాలు వేసే విధానాన్ని తగ్గించాలని హైకోర్టు సూచించింది. ‘జరిమానా సొమ్మును 90 రోజుల్లో చెల్లించకుంటే వాహనాన్ని జప్తు చేయొచ్చన్న నిబంధనను ఎందుకు అమలు చేయడం లేదు? నిర్దిష్ట సమయంలో చలానాలు చెల్లించని వారి వాహనాలను సెక్షన్-167 ప్రకారం సీజ్ చేయాలి. సెక్షన్-206 ప్రకారం వారి లైసెన్స్ రద్దు చేయాలి. హెల్మెట్ ధరించని కారణంగా జూన్ నుంచి 3 నెలల్లో 667 మంది చనిపోవడం చిన్నవిషయం కాదు. ఇది ఆందోళనకరమని వ్యాఖ్యానించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com