Grandhi Srinivas Resign: వైసీపీకి షాకుల మీద షాకులు

వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు గ్రంధి శ్రీనివాస్ ప్రకటించారు. అంతకుముందు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ సైతం వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి తరువాత వైసీపీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరించిన నేతలు ఒక్కొక్కరిగా పార్టీ వీడుతున్నారు. తాజాగా 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ను ఓడించిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సైతం వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. 2024 ఎన్నికల్లో జనసేన నుంచి పులపర్తి రామాంజనేయులు పోటీ చేయగా....వైసీపీ అభ్యర్థిగా మళ్లీ గ్రంథి శ్రీనివాస్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అదే ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో గ్రంథి శ్రీనివాస్ మౌనం వహిస్తున్నారు. గ్రంథి శ్రీనివాస్ జనసేన పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతుంది. మరి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్...మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా ఇవ్వరా అనేది తెలియాల్సి ఉంది.
2024ఎన్నికల ఫలితాల్లో వైసీపీ బొక్క బోర్లా పడిన సంగతి తెలిసిందే. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేనంత దారుణంగా ఓటమి పాలైంది. ఎప్పుడైతే వైసీపీ ఓటమి పాలైందో అప్పటి నుంచి ఆ పార్టీకి గడ్డుకాలం తప్పడం లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలుగొందిన నేతలు అంతా ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. తాజాగా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. విశాఖ జిల్లాలో వైసీపీకి మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన గంట వ్యవధిలోనే గ్రంథి శ్రీనివాస్ తన పదవికి..వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా గ్రంథి శ్రీనివాస్ రాజకీయాల్లో స్తబ్ధుగా ఉన్నారు. వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో రగిలిపోతున్నారని ఈ క్రమంలోనే పార్టీకి రాజీనామా చేశారని అనుచరులు చెప్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com