AP: డోలీలో బాలింత.. మోయలేక సొమ్మసిల్లిన నర్సు

విజయనగరం జిల్లాలో శృంగవరపు కోట శివారు గ్రామంలో అమానుషం. పచ్చి బాలింతను ఆస్పత్రికి తరలించేందుకు నానా కష్టాలు పడుతున్నారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్,108 వాహనం అందుబాటులో లేకపోవడంతో బాలింతను డోలిలో తరలించారు ఆశా కార్యకర్తలు, నర్సులు. అయితే రెండు కిలోమీటర్లు వెళ్లాక ఆస్పత్రికి వెళ్లేందుకు బాలింత నిరాకరించిడంతో.. తిరిగి స్వగ్రామానికి తీసుకొచ్చారు. తిరుగు ప్రయాణంలో డోలీ మోస్తున్న ఓ ఏఎన్ఎం సొమ్మసిల్లి పడిపోయింది. అంబులెన్స్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు అంటున్నారు.
శృంగవరపు కోట గుడిలోవకు చెందిన ఓ మహిళకు నెలలు నిండటంతో మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే కడుపు నొప్పి రావడంతో ఆ బాలింతను సీహెచ్సీ తరలించాలని అనుకున్నారు. అయితే గ్రామంలో ఎలాంటి వాహనం అందుబాటులో లేకపోవడంతో ఆశా వర్కర్లు, నర్సులు కలసి ఓ వృద్దుడి సహాయంతో డోలీలో తరలించే ప్రయత్నం చేశారు. అయితే కొంత దూరం వెళ్లాక బాలింత అస్పత్రి వెళ్లేందుకు ఆసక్తి చూపక పోవడంతో చేసేది ఏమిలేక తిరుగుప్రయాణం అయ్యారు. ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న వైద్య సౌకర్యాలు ఏవీ అందుబాటులో లేకపోవడం తోనే ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని విమర్శలు వస్తున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com