AP : సత్యకుమార్ వాహనంపై అల్లరిమూకల రాళ్ల దాడి
అమరావతిలోని మందడం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమరావతి ఉద్యమం 12 వందల రోజులకు చేరుకున్న నేపథ్యంలో రైతులకు బీజేపీ నేత సత్యకుమార్ మద్దతు తెలిపారు. తిరిగి వస్తున్న సమయంలో మూడు రాజధానుల శిబిరం వద్ద సత్యకుమార్ వాహనాన్ని అల్లరి మూకలు అడ్డుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన కారు డ్రైవర్ వాహనాన్ని ముందుకు పోనిచ్చారు.. ఈ క్రమంలో సత్యకుమార్ వాహనంపై అల్లరిమూకలు రాళ్లతో దాడి చేశాయి. ఈ ఘటనలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి..
మందడంలో దాడి ఘటనపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఘాటుగా రియాక్టయ్యారు.. పథకం ప్రకారమే తనపై దాడి జరిగిందన్నారు.. తమ కార్లపై పెద్ద పెద్ద రాళ్లతో దాడులు చేశారని అన్నారు.. మా కార్యకర్తలను వెంటబడి కొట్టారని సత్యకుమార్ అన్నారు.. పోలీసులు కార్లను ఆపేసిన వెంటనే దాడి మొదలైందన్నారు. కార్లపై దాడి జరుగుతుంటే పోలీసులు అడ్డుకోలేదన్నారు సత్యకుమార్.. దాడి చేస్తున్న వారిని నియంత్రించలేదని, దాడులు జరుగుతుంటే పోలీసులు చోద్యం చూశారని ఆయన ఆరోపించారు. జగన్ ప్రభుత్వం వ్యతిరేకగళం లేకుండా చేయాలనుకుంటోందని మండిపడ్డారు.. ఇటువంటి దాడులకు భయపడేది లేదన్నారు సత్యకుమార్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com