AP : పింఛనుదారులపై మరో పిడుగు

పింఛనుదారులపై వైసీపీ ప్రభుత్వం మరో పిడుగు వేసింది. ఇప్పటికే పోర్టబులిటీ విధానాన్ని రద్దు చేసింది. ఏ నెల పింఛను ఆ నెలలోనే తీసుకోవాలనే నిబంధనను పెట్టింది. తాజాగా ఈ నెల నుంచే జియో ఫెన్సింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానంలో ఇక నుంచి ఎవరైనా లబ్ధిదారుడికి తన నివాస ధ్రువీకరణ పత్రాలున్న సచివాలయ ప్రాంతం నుంచి 15 కిలోమీటర్ల లోపు మాత్రమే వాలంటీర్లు పింఛను అందించే సదుపాయం ఉంది. 15 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంటే పింఛను మొత్తాన్ని అందించే అవకాశం వాలంటీరుకు ఉండదు. అలాంటి వారికి పింఛను ఇవ్వాల్సి వస్తే జిల్లా డీఆర్డీఏ అధికారులను సంప్రదించాలని గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా 63.42 లక్షల మందికి ప్రభుత్వం ఈ నెలకుగాను పింఛన్లు అందిస్తోంది. వీరిలో కొంతమంది పింఛను తీసుకునే సమయానికి వివిధ కారణాలతో ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స తీసుకుంటుంటారు. మరి కొంత మంది దూరప్రాంతాలకు వెళ్లి సకాలంలో అందుబాటులో ఉండలేని పరిస్థితి ఉంటోంది. ఇవే కాకుండా దూర ప్రాంతాల్లోని పిల్లల దగ్గర కొంతమంది వృద్ధులు ఉంటున్నారు. పైగా కనీసం సమయం ఇవ్వకుండా నిన్నటి నుంచే ఈ ఆదేశాలను అమల్లోకి తెచ్చారు. దీంతో లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి ఏజెన్సీల్లోని మారుమూల గిరిజన ప్రాంతాల్లోని వారు కూడా ఇప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది.
నివాస ధృవీకరణ పత్రాలు ఒక గ్రామంలో ఉండి.. ఇతర అవసరాల రీత్యా వేరే గ్రామాలు లేదా నగరాల్లో ఉంటున్న లబ్ధిదారులు పోర్టబులిటీ విధానంలో అక్కడే పింఛను తీసుకునే వెసులుబాటు గతంలో ఉండేది. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఈ విధానాన్ని రద్దు చేసింది. ఇప్పుడు జీయో ఫెన్సింగ్ విధానంతో.. మరింత మందికి పింఛన్ కట్ చేసే పనిలో ఉందంటువాపోతున్నారు పెన్షన్దారులు. సర్కారు తీసుకొచ్చిన ఈ విధానంపై మండిపడుతున్నాయి విపక్షాలు. అప్పులతో సతమతమవుతున్న జగన్ సర్కారు.... ఇలాంటి నిర్ణయాలతో... పేదల కడపుకొడుతోoదంటూ ఫైర్ అవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com