Pawan Kalyan : ఏ హీరోతోనూ నేను పోటీ పడను..

సినిమాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందు బాధ్యతలు ఆ తర్వాతే సినిమాలు అని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా కంకిపాడులో సోమవారం ‘పల్లె పండుగ-పంచాయతీ వారోత్సవాలు’ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న సమయంలో అభిమానులు ఓజీ.. ఓజీ.. అంటూ గట్టిగా అరిచారు. దీంతో ఆయన సినిమాలపై కూడా స్పందించారు.
చాలా రోజుల వరకు ఓజీ.. ఓజీ.. అని జనాలు అంటుంటే.. తనకు మోదీ.. మోదీ అని వినబడేదని పవన్ కల్యాణ్ తెలిపారు. ఫ్యాన్స్ తమ అభిమాన హీరోల సినిమాలకు వెళ్లాలంటే రాష్ట్రంలో డబ్బులు ఉండాలని పేర్కొన్నారు. అభిమానులు సినిమాలకు వెళ్లాలంటే రోడ్లు బాగుండాలని, టికెట్ కొనాలంటే డబ్బులు ఉండాలని అన్నారు. అందుకే గ్రామాల్లో అభివృద్ధి చేసుకోవాలని, ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనికోసం రాష్ట్రంలో డబ్బు ఉండాలని.. ప్రతి ఒక్కరి కడుపు నిండాలని అన్నారు. అందుకే ముందుగా కడుపు నింపే పనిచేద్దామని తెలిపారు. ఆ తర్వాతే విందులు అయినా.. వినోదాలు అయినా.. ఓజీ అయినా అని పేర్కొన్నారు. ముందు బాధ్యత ఆ తర్వాతే సినిమాలు అని స్పష్టం చేశారు.
టాలీవుడ్లో తనకు ఏ హీరోతోనూ ఇబ్బంది లేదని పవన్ కల్యాణ్ తెలిపారు. ఎవరితోనూ తాను పోటీ పడనని పేర్కొన్నారు. హీరోల్లో ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో నిష్ణాతులుగా ఉన్నారని చెప్పారు. బాలకృష్ణ, చిరంజీవి, మహేశ్బాబు, తారక్, అల్లు అర్జున్, రామ్ చరణ్, నాని ఇలా అందరు హీరోలు బాగుండాలని కోరుకున్నారు. ఇలా మీ అభిమాన హీరోలకు మీరు జై కొట్టాలంటే ముందు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుండాలని ప్రజలకు తెలిపారు. కాబట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బాగు చేసుకోవడంపై దృష్టి పెడదామని అన్నారు. మీకు పని కావాలి, స్కిల్ డెవలప్మెంట్ కావాలి.. వాటిపై దృష్టి పెట్టి.. ఆ తర్వాతే విందులు, వినోదాలు చేసుకుందామని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com