AP: ఏపీ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు

AP: ఏపీ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఒకటో తేదీనే వారి ఖాతాల్లో జమయ్యాయి. ఉద్యోగులకు సోమవారం దాదాపు 90 శాతంపైగా జీతాలు పడిపోగా.. పెన్షనర్లకు పింఛన్లు కూడా 50 శాతం అందాయి. మిగతావారికి కూడా ఇవాళ జీతాలు, పెన్షన్లు పూర్తిస్థాయిలో అందుతాయని ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు. పోలీస్‌, రెవెన్యూ, హెల్త్‌, పంచాయతీరాజ్‌ ఉద్యోగులకు జీతాలందాయి. కొన్ని జిల్లాల్లో దాదాపు వంద శాతం జీతాలు జమయ్యాయి. టీచర్ల బిల్లులు చివర్లో పెట్టడం వలన వారిలో ఎక్కువ మందికి జీతాలు పడలేదు. ఇవాళ అందరికీ వంద శాతం అందుతాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని బిల్లులూ పూర్తిగా క్లియర్‌ అయినట్టు తెలిసింది. నాలుగున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఒకటో తేదీనే జీతాలిచ్చిన చరిత్ర లేదు. జీతాలు, పెన్షన్లు పూర్తిస్థాయిలో పడాలంటే నెలలో మూడోవారం వచ్చేది. కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటి నెలలోనే ఉద్యోగులకు జీతాలు దాదాపు పూర్తిస్థాయిలో, పెన్షన్లు సగానికి పైగా అందాయి. ప్రభుత్వోద్యోగులకు జీతాలు, పెన్షన్లు కలిపి నెలకు రూ.5,500 కోట్లు అవసరమవుతాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఖజానాకు నెలకు రూ.13,000 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అవిగాక వారం వారం అందినకాడికి అప్పులు తెచ్చేవారు. అయినప్పటికీ ఒక్క నెలలో కూడా సకాలంలో జీతాలు, పెన్షన్లు చెల్లించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చీరాగానే అటు సామాజిక పెన్షన్లు, ఇటు ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఏకకాలంలో ఇచ్చేసి సామర్థ్యాన్ని నిరూపించుకుంది.

Next Story