మరో విచిత్రమైన జీవో తెచ్చిన ఏపీ ప్రభుత్వం

మరో విచిత్రమైన జీవో తెచ్చిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం మరో విచిత్రమైన జీవో తెచ్చింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కుక్కలు, పందులకు లైసెన్స్‌లు ఉండాలంటూ ఉత్తర్వులు విడుదల చేసింది. లైసెన్స్ లేని కుక్కలు, పందులను అధికారులు పట్టుకుంటే 500 ఫైన్‌తో పాటు రోజుకు 250 రుసుము వసూలు చేయాలని జీవోలో పేర్కొంది. ఎవరూ వాటి ఓనర్లుగా అంగీకరించకపోతే వాటిని కూడా వీధి కుక్కులు, పందులుగా పరిగణించి కుటుంబ నియంత్రణ చేయాలని ఉత్తర్వుల్లో వెల్లడించింది. లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత 10 రోజుల్లోగా తిరిగి లైసెన్స్ పొందాలని ఆదేశాల్లో పేర్కొంది.

లైసెన్స్‌లు పొందే ముందు కుక్కలు, పందుల యజమానులు వాటి హెల్త్ సర్టిఫికెట్ అందజేయాలంటూ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కుక్కల విషయంలో హెల్త్ సర్టిఫికెట్ అందించడం, పందుల విషయంలో ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వాలని అదేశించింది. ప్రతి గ్రామ పంచాయతీలో కుక్కలు, పందుల యజమానులకు టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించింది. ఆ టోకెన్లను పెంపుడు జంతువుల మెడ చుట్టూ నిరంతరం వేలాడేలా ఉంచాలని ఆదేశించింది. ఈ మేరకు జీవో ఎంఎస్ 693లో పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది ఆదేశాలిచ్చారు.

అంతేకాదు గ్రామాల్లో పెంపుడు కుక్కలు, పందులు, వీధి కుక్కలపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీకి గ్రామ సర్పంచ్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. అలాగే పంచాయతీ సెక్రటరీ కన్వీనర్‌గా ఉంటారు. మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన మెడికల్ ఆఫీసర్, మండల పశుసంవర్ధక శాఖ అధికారి, గ్రామ పశుసంవర్ధక శాఖ సహాయకుడు, జిల్లా SPCA నామినేట్ చేసిన సభ్యులు, జంతు సంరక్షణ సంస్థల నుంచి ఇద్దరు వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ గ్రామ పంచాయతీల్లో పెంపుడు కుక్కలు, పందుల సంఖ్య, వాటి పరిస్థితిని పర్యవేక్షిస్తుంది.


Tags

Read MoreRead Less
Next Story