విచారణ జరపకుండానే ప్రభుత్వం ఇలాంటి అభిప్రాయానికి రావచ్చా? : ఏపీ హైకోర్టు

విచారణ జరపకుండానే ప్రభుత్వం ఇలాంటి అభిప్రాయానికి రావచ్చా? : ఏపీ హైకోర్టు
ప్రభుత్వానికి అపరిమిత పునఃసమీక్ష అధికారం కల్పిస్తే ప్రతిసారీ ఎన్నికల తర్వాత అది దుర్వినియోగం అయ్యేందుకు దారి తీస్తుందని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు స్పష్టం చేసింది..

ప్రభుత్వానికి అపరిమిత పునఃసమీక్ష అధికారం కల్పిస్తే ప్రతిసారీ ఎన్నికల తర్వాత అది దుర్వినియోగం అయ్యేందుకు దారి తీస్తుందని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు స్పష్టం చేసింది. పునఃసమీక్షించే అధికారం ఏ ప్రభుత్వానికీ స్వతఃసిద్ధంగా లేదని పేర్కొంది. గత ప్రభుత్వ స్థాయిలో తీసుకున్న నిర్ణయాల్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు అంత సులువుగా రద్దు చేయకూడదని తెలిపింది. అసంపూర్ణంగా మిగిలిపోయిన పనులను పూర్తిచేయాల్సిన బాధ్యత తర్వాత వచ్చే ప్రభుత్వంపై ఉందని 'స్టేట్ ఆఫ్‌ హర్యానా వర్సెస్‌ స్టేట్ ఆఫ్‌ పంజాబ్‌' కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని గుర్తుచేసింది. గత ప్రభుత్వ నిర్ణయాల్ని పునఃసమీక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం, ప్రత్యేక దర్యాప్తు బృందం చర్యలను నిలుపుదల చేస్తూ.. బుధవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. టీడీపీ సీనియర్‌ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించారు.

హైకోర్టు ఉత్తర్వుల్లో పూర్తి వివరాలు గురువారం అందుబాటులోకి వచ్చాయి. ఈ ఉత్తర్వుల్లో హైకోర్టు పలు అంశాల్ని ప్రస్తావించింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టులు, నిర్ణయాలు, విధానాల్ని రాజకీయ కారణాలతో పునఃసమీక్షించడం లేదా విస్మరించడం చేయకూడదని సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టం చేసిందని హైకోర్టు ఉత్తర్వుల్లో తెలిపింది. రాష్ట్ర పురోభివృద్ధికి ప్రభుత్వ విధానాల్లో నిలకడ అవసరమని, తీవ్రమైన చట్ట ఉల్లంఘనలు, స్పష్టమైన మోసం జరిగిన సందర్భాల్లో తప్ప... రాజకీయ కారణాలతో ఇష్టానుసారంగా విధానాలను మార్చడానికి వీల్లేదని స్పష్టంచేసింది. ప్రజాప్రతినిధులతో పాటు ప్రతి ఒక్కరూ దానికి కట్టుబడి ఉండాలని, ఆ విషయాన్ని విస్మరిస్తే.. పరిస్థితిని చక్కదిద్దేందుకు హైకోర్టు జోక్యం చేసుకుంటుందని పేర్కొంది.

ఎన్నికయిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని నడుపుతారని, చట్ట ప్రకారం పరిపాలించేందుకు ఇచ్చిన అధికారానికి వారు తాత్కాలిక ధర్మకర్తలు అని హైకోర్టు ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ సందర్భంగా... ఆల్‌ఫ్రెడ్‌ లార్డ్‌ టెన్నిసన్‌ పుస్తకం ప్రకారం 'ప్రభుత్వం' అనేది స్థిరంగా ఉంటుందని, పాలకులు వస్తుంటారు.. పోతుంటారని వివరించింది. ప్రభుత్వం నిరంతర ప్రక్రియ అనే విషయాన్ని పగ్గాలు చేపట్టినవారు తరచు మరిచిపోతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రజాస్వామ్యంలో తాత్కాలిక ధర్మకర్తలు నిర్దిష్ట కాలం వరకే పరిపాలిస్తారని, చట్టాలకు కట్టుబడి పరిపాలించేందుకు అధికారం అప్పగించడమే ప్రజాస్వామ్యం ప్రధాన ఉద్దేశమని తెలిపింది. చట్టబద్ధ పాలనకు ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా అధికారంలో ఉన్నవాళ్లు కట్టుబడి ఉండాలని వెల్లడించింది.

గత ప్రభుత్వ నిర్ణయాల్ని సమీక్షించేందుకు 2019 జూన్‌ 26న మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ జారీచే సిన జీవోను పరిశీలిస్తే గతంలో నేరాలు చోటుచేసుకున్నట్టు ప్రభుత్వం ముందుగానే నిర్ణయానికి వచ్చినట్లుందని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. 'హద్దులేని అవినీతి', 'భూ ఆక్రమణ' వంటి పదాలను జీవోలో ప్రస్తావించారని, ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని రాజకీయ కారణాలతో ఏర్పాటు చేశారా, సరైన విచారణ జరపకుండానే ప్రభుత్వం ఇలాంటి అభిప్రాయానికి రావచ్చా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని హైకోర్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ నేరాలపై మంత్రివర్గ ఉపసంఘం, సిట్ అవసరం లేకుండానే పోలీసు వ్యవస్థతో దర్యాప్తు చేయించుకోవచ్చని, మంత్రివర్గ ఉపసంఘం, సిట్ ఏర్పాటు చేయాలని శాసనసభ స్పీకర్‌ ఆదేశించడానికి కారణాలు లేవని జస్టిస్‌ సోమయాజులు ఉత్తర్వుల్లో తెలిపారు. ఉపసంఘం ఏర్పాటు అవసరం ఏమిటి? దీనికి ఆధారాలేంటో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు' అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story