నిమ్మగడ్డ పదవిలో ఉన్నంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరగవన్న వైసీపీ నేతలు

నిమ్మగడ్డ పదవిలో ఉన్నంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరగవన్న వైసీపీ నేతలు
వైన్‌ షాపులు, పార్టీ సమావేశాలు,సభలు పెడితే రాని కరోనా.. స్థానిక సంస్థల ఎన్నికలు అనేసరికే వస్తుందా?

ఏ ముహూర్తానా ఏపీలో జగన్‌ సర్కారు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభించిందో కానీ.. మొదట్నుంచి అన్నీ అడ్డంకులే! అన్ని వివాదాలే! గతంలో మొత్తం 3 విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. షెడ్యూల్ ప్రకారం 2020 మార్చి 21న తొలి విడత ఎన్నికలు జరగాలి. అయితే అంతలోనే దేశంలో కరోనా విజృంభణ మొదలైంది. ముందు జాగ్రత్తగా రాష్ట్రంలో ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు SEC నిమ్మగడ్డ రమేష్‌ కుమార్.. ఇక అప్పటి నుంచి ప్రభుత్వానికి, నిమ్మగడ్డకు మధ్య వివాదం రాజుకుంది.ఏకంగా సీఎం జగన్ ప్రెస్‌మీట్ పెట్టిమరీ నిమ్మగడ్డపై నిప్పులు చెరిగారు. కులాన్ని అంటగట్టారు. బ్లీచింగ్ పౌడర్, పారాసిటామాల్ వేస్తే పోయే కరోనా కోసం ఎన్నికలు వాయిదా వేస్తారా అంటూ ఒంటికాలిపై లేచారు. గవర్నర్‌ వద్దకు వెళ్లి పంచాయితీ పెట్టారు. ఇక వైసీపీ నేతలు, మంత్రుల నోర్లకైతే అడ్డూ అదుపు లేకుండా పోయింది. నిమ్మగడ్డను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. అప్పటి CSనీలం సాహ్ని, SECకి మధ్య లేఖల యుద్ధం నడిచింది. చివరికి వ్యవహారం హైకోర్టు..సుప్రీం కోర్టు వరకూ వెళ్లింది. తనకు ప్రాణహాని ఉందంటూ ఏకంగా కేంద్రానికి విన్నవించుకున్నారు రమేష్‌కుమార్.

నామినేషన్ల సమయంలో వైసీపీ దౌర్జన్యాలు, అక్రమాలను అడ్డుకోవడంతోపాటు..ఎన్నికలనూ వాయిదా వేయడాన్ని జీర్ణించుకోలేక పోయిన ప్రభుత్వం నిమ్మగడ్డను టార్గెట్ చేసింది..రమేష్ కుమార్‌ను తప్పించేందుకు ఉన్న అన్ని మార్గాలను వెతికి చివరికి ఆర్డినెన్స్‌ అస్త్రం ఉపయోగించుకుంది. దీన్ని జారీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్‌ చట్టం -1994లోని సెక్షన్‌ 200ను సవరించారు. తర్వాత ఆర్డినెన్స్‌ నంబర్ 5ను జారీ చేశారు. తద్వారా ప్రిన్సిపల్‌ సెక్రటరీ స్థాయిలో పనిచేసిన రిటైర్డ్ IAS బదులు.. రిటైర్డ్ హైకోర్టు జడ్జిని SECగా నియమించాలని నిర్ణయించారు. అలాగే కమిషనర్ పదవీకావాలన్ని ఐదేళ్లకు బదులు మూడేళ్లకు కుదించారు. ఇలా ఆఘమేఘాలపై ఆర్డినెన్స్ తెచ్చి దాని ఆధారంగా రమేష్ కుమార్‌ను పదవి నుంచి తప్పించిన YCP సర్కార్.తెల్లారేసరికి ఆయన స్థానంలో కనగరాజ్‌ను నియమించింది. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడడం, రిటైర్డ్‌ జస్టిస్‌ కనగరాజ్ బాధ్యతలు చేపట్టడం కూడా చకచకా జరిగిపోయాయి. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో సవాల్ చేశారు నిమ్మగడ్డ. చివరికి న్యాయపోరాటంలో నిమ్మగడ్డ విజయం సాధించారు. అయినా నిమ్మగడ్డకు బాధ్యతలు అప్పగించేందుకు అనేక కొర్రీలు పెట్టింది ప్రభుత్వం. చివరికి కోర్టుల జోక్యంతో ఇటీవలే SECగా తిరిగి బాధ్యతలు చేపట్టారు నిమ్మగడ్డ.

బాధ్యతలు చేపట్టిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియను మొదలు పెట్టారు నిమ్మగడ్డ. మొదట్లో కరోనా పేరు చెప్పి ఎన్నికలు వాయిదా వేశారని గగ్గోలు పెట్టిన జగన్ సర్కారు.. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తామంటే..అదే కరోనాను సాకుగా చూపి తప్పుకుంటోంది.పారాసిటామాల్, బ్లీచింగ్ పౌడర్ అన్నవాళ్లే ఇప్పుడు కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్ అంటూ ఎన్నికల ప్రక్రియను సాగదీసే ప్రయత్నం చేస్తున్నారు.

వైన్‌ షాపులు, పార్టీ సమావేశాలు,సభలు పెడితే రాని కరోనా.. స్థానిక సంస్థల ఎన్నికలు అనేసరికే వస్తుందా? నిమ్మగడ్డ పదవీలో ఉన్నంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరగవంటూ పలువురు అధికార పార్టీ నేతలు వ్యాఖ్యానించారంటేనే ప్రభుత్వ ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోవచ్చు.! అందుకే ఎన్నికల నిర్వహణకు SECకి ఏ మాత్రం సహకరించలేదు ప్రభుత్వం. దీంతో మరోసారి కోర్టును ఆశ్రయించారు నిమ్మగడ్డ. చివరికి న్యాయస్థానాల జోక్యంతో అధికారుల బృందాన్ని SEC వద్దకు పంపింది ప్రభుత్వం. ఇప్పుడు కూడా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదనే స్పష్టం చేసింది ప్రభుత్వం. రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత తనపై ఉందన్న నిమ్మగడ్డ ఎట్టకేలకు షెడ్యూల్ రిలీజ్ చేశారు. అయితే ఈ ఎపిసోడ్ ఇప్పటితో ముగిసేలా లేదు.. ప్రభుత్వం మళ్లీ సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయించడంతో స్థానిక ఎన్నికల సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది.

Tags

Read MoreRead Less
Next Story