పోలీసులు, సీఐడీపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

పోలీసులు, సీఐడీపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
ఖాకీస్ట్రోకసీ అనే దారుణమైన పాలనలో ఉన్నామనే భావనను.. ప్రజలకు కలిగిస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది

సీఐడీ- పోలీసులపై... ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరాధార కేసులు, వేధింపులతో అరాచకానికి బాటలు వేస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. పోలీసులన్నది ప్రజలను కాపాడేందుకేనా అంటూ ప్రశ్నించింది. అధికార పార్టీ కోసం అత్యుత్సాహానికి పాల్పడుతున్నారని పేర్కొంది. ప్రజల్లో అలాంటి భావనే కలుగుతోందని హైకోర్టు అభిప్రాయపడింది. పార్టీలతో సంబంధం లేకుండా పోలీసు వ్యవస్థ పనిచేయాలని హైకోర్టు సూచించింది. చట్టాల ఉల్లంఘన నుంచి ప్రజలను కాపాడటమే పోలీసుల ప్రధాన విధి అని హైకోర్టు పేర్కొంది. అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ... దానితో సంబంధం లేకుండా పనిచేయాలని సూచించింది. తగిన ఆధారాలు లేకుండా కేసు నమోదు చేయడం, దర్యాప్తు పేరుతో బాధితులను వేధింపులకు గురిచేయడం అరాచకత్వానికి దారితీస్తుందని ఏపీ హైకోర్టు తెలిపింది.

ఖాకీస్ట్రోకసీ అనే దారుణమైన పాలనలో ఉన్నామనే భావనను.. ప్రజలకు కలిగిస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ అధిపతిపై సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసును.. కోర్టు తప్పుబట్టింది. రాష్ట్ర ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిపైనా ఆ ఛానెల్‌ అభ్యంతర వార్తలు ప్రసారం చేసిందని పి.జగదీశ్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి సీఐడీ పోలీసులు ఏప్రీల్‌ 29న ఐపీసీ 188, 505-2, 506, విపత్తుల నిర్వహణ చట్టంలోని సెక్షన్‌ 54 కింద కేసు నమోదు చేశారు. ఆకేసును రద్దు చేయాలని కోరుతూ...ఆ ఛానెల్‌ ఎండీ.. కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిగిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తి ఇటీవల తీర్పు వెలువరించారు.

ఈ వ్యవహారంలో కేసు నమోదు, దర్యాప్తు తీరుతోపాటు .. సదరు ఛానెల్‌కు చెందిన ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను స్వాధీనం చేసుకున్న విధానాన్ని పరిశీలిస్తే అధికారంలో ఉన్న పార్టీని సంతృప్తి పరిచేందుకే చేసినట్లుందని, ఇది తప్ప మరొకటి కాదని జడ్జి తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీ అధికారంలోకి రావచ్చు...కొంతకాలానికి పోవచ్చు..అయితే అధికారులు రాజకీయ పార్టీలతో నిమిత్తంలేకుండా పనిచేయాలని కోర్టు తెలిపింది. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పటికీ.. చట్టంపట్ల కనీస అవగాహన, శాఖపై పాలననాపరమైన నియంత్రణలేని అధికారులవల్ల ఖాకీస్ట్రోకసీలో జీవిస్తున్నామనే భావన ప్రజల్లో కలుగుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి చర్యలను నియంత్రిచని పక్షంలో ప్రజలకు జీవించే హక్కు, వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలుగుతాయని జడ్జి పేర్కొన్నారు.

చట్టాలను ఉల్లంఘించినవారి నుంచి ప్రజలను రక్షించడమే సీఐడీ, లా అండ్ ఆర్డర్‌ పోలీసుల ప్రధాన విధి అని హైకోర్టు గుర్తు చేసింది. యూ ట్యూబ్ ఛానెల్‌ కేసులో సీఐడీ పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కోర్టు వ్యాఖ్యానించింది. సీఐడీ పోలీసులు ప్రభుత్వానికి సాధనంగా మారి పిటిషనర్‌పై కేసు నమోదు చేశారిన జడ్జి తెలిపారు. ఇది చట్టవిరుద్ధమని... ఏకపక్షమని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story