ఏపీలో రేపట్నుంచి తిరిగి తెరుచుకోనున్న స్కూళ్లు, కాలేజీలు

ఏపీలో రేపట్నుంచి తిరిగి తెరుచుకోనున్న స్కూళ్లు, కాలేజీలు

కొవిడ్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏపీలో 7 నెలలుగా మూతపడిన స్కూళ్లు, కాలేజీలు... రేపట్నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని స్కూళ్లు, కాలేజీల పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్‌ వెల్లడించారు. కోవిడ్‌ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.

రేపట్నుంచి నుంచి తొమ్మిది, పదితో పాటు ఇంటర్‌ విద్యార్థులకు తరగతులు రోజు విడిచి రోజు... ఒక్క పూట నిర్వహిస్తారు. రొటేషన్‌ పద్ధతిలో తరగతులను నిర్వహిస్తారు. నవంబర్‌ 23 నుంచి ఆరు, ఏడు, ఎనిమిదో తరగతులకు బోధన ప్రారంభం అవుతుంది. అలాగే రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకుల పాఠశాలలు ప్రారంభం అవుతాయి. ఇక... డిసెంబర్‌ 14 నుంచి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతులకు క్లాసులు నిర్వహిస్తారు. నవంబర్‌ 16 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ తరగతులు మొదలు కానున్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు అన్నింటికీ కూడా ఇదే షెడ్యూల్‌ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. 2020-21 విద్యా సంవత్సరం వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి కానుందని ప్రభుత్వం వెల్లడించింది. కరోనా కారణంగా కోల్పోయిన విద్యా సంవత్సరాన్ని కవర్ చేసేందుకు సిలబస్‌ రూపకల్పన చేస్తున్నారు. స్కూళ్లకు 180 రోజుల పని దినాలు ఉంటాయి.

స్కూళ్లు తెరుస్తుండటంతో..... కరోనా నివారణ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే.. అదే సమయంలో... విద్యార్ధులు సైతం కచ్చితంగా జాగ్రతలు తీసుకోవాలి. సోషల్‌ డిస్టెన్స్‌, శానిటైజర్‌, మాస్కూలు తప్పనిసరిగా వాడాలి. ఈ విషయాన్ని తల్లిదండ్రులు విద్యార్ధులకు స్పష్టంగా చెప్పాలి. ఏపీలో ఇప్పటికే కరోనా కేసులు 8 లక్షలు దాటాయి. ఇక సగం మందికి అనధికారికంగా వచ్చిపోయిందంటున్నారు. ఏది ఏమైనా డిసెంబర్‌ నాటికి కరోనా తగ్గుముఖం పడుతుందంటున్నారు. మరణాల రేటు కూడా తగ్గుతోంది. అలా అని నిర్లక్ష్యం వద్దు. ముఖ్యంగా విద్యార్ధులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. నిన్న మొన్నటి వరకు సెల్ఫ్‌ డిసిప్లిన్‌తో ఉన్నవాళ్లంతా క్రమంగా అది వదిలేస్తున్నారు. అదే జరిగితే ఇప్పుడు యూరోప్‌లో ఏం జరిగిందో అదే జరుగుతుంది.

వాస్తవానికి కరోనా తగ్గిపోలేదు. పూర్తిగా నాశనం కాలేదు. తగ్గుతుంది. మళ్లీ పెరిగినా పెరుగుతుంది. రాబోయేది చలికాలం. వైరస్‌ విజృంభించడానికి అవకాశం ఎక్కువ. అందువల్ల, కరోనా తగ్గిందనుకోవడం ఓ భ్రమ. అలసత్వం చేయవద్దు.. మాస్క్‌ వదలవద్దు. మొదట్లో భయపడి ఎలాంటి జాగ్రత్తలు వహించామో.. అదే జాగ్రత్తలు వహించండి. లేదంటే మళ్లీ ముప్పు పెరుగుతుందంటున్నారు డాక్టర్లు. చలికాలం కూడా వచ్చేస్తోంది. వైరస్, బ్యాక్టీరియాలు పంజా విసరడానికి.. ఇది ఎంతో అనుకూలమైన కాలం. ఈ సమయంలో డెంగీ, మలేరియా, స్వైన్ ఫ్లూ తదితరల సీజనల్ వ్యాధులు అటాక్ చేస్తాయి. గతంతో పోలీస్తే ఈసారి సీజనల్ వ్యాధులు కాస్త తక్కువగానే ఉన్నా.... ఈ సమయంలో కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు.

ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు అనిపిస్తుంది.. అలా అని కరోనా పీడ విరగడైందనే భ్రమ మాత్రం వద్దంటున్నారు డాక్టర్లు. ఇప్పటికే అమెరికా, ఐరోపా దేశాల్లో సెకండ్ వేవ్ వణికిస్తోంది. కేరళలో తగ్గిన కరోనా కేసులు.. ఓనం పండుగ తర్వాత పెరిగిపోయాయి. అందుకే మొదటి సారి వైరస్ నియంత్రణ కోసం తీసుకున్న జాగ్రత్తలు.. ఇపుడు కచ్చితంగా కొనసాగించాలంటున్నారు వైద్యులు.

Tags

Read MoreRead Less
Next Story