APPSC: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు

APPSC: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు
X
92 శాతం మంది హాజరు... చివరి నిమిషం నిబంధనతో అభ్యర్థుల కన్నీటి పర్యంతం

అభ్యర్థుల ఆందోళనలు, పలు విభేదాలు మధ్య జరిగిన APPSC గ్రూప్‌-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షకు 92 శాతం మంది హాజరైనట్లు ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తెలిపింది. గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షకు 92, 250 మంది దరఖాస్తులు చేసుకోగా.. 86,459 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. వారిలో 92శాతం మంది హాజరయ్యారు.

కన్నీటి పర్యంతమైన అభ్యర్థులు

గ్రూప్-2 విశాఖలో 11029 అభ్యర్డులు, 16 పరీక్ష కేంద్రాలలో పరీక్ష నిర్వహించారు. మధురవాడలో సాంకేతిక ఇంజనీరింగ్ కళాశాల, చైతన్య ఇంజనీరింగ్ కళాశాల, వికాస్ విజయం టెక్నో పాఠశాల పరీక్షా కేంద్రాలలో పరీక్షలకు అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షా కేంద్రానికి సమయానికి చేరుకోని విద్యార్థులను పరీక్ష కేంద్ర అధికారి పరీక్ష కేంద్రం లోకి అనుమతించక పోవటంతో అభ్యర్థులు కన్నీరు మున్నీరు అయ్యారు. ఏడ్చినా అనుమతించక వెనుదిరిగారు. విశాఖలో గ్రూప్ -2 మెయిన్ ఎగ్జామ్స్ ప్రశాంతంగా ముగిశాయి. ఈ పరీక్షలకు మొత్తం విశాఖలో 16 కేంద్రాల్లో 11,030 మంది అభ్యర్థులు హాజరు అవ్వాల్సి ఉండగా అందులో ఉదయం పరీక్షకు 9,391 మంది హాజరయ్యారు. 1639 మంది గైర్హాజరు అయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 11,030 మంది అభ్యర్థులు హాజరు అవ్వాల్సి ఉండగా అందులో 9370 మంది హాజరయ్యారు. 1660 మంది రాలేదని అధికారులు తెలిపారు.

గ్రూప్ 2 పరీక్ష కేంద్రాలు తనిఖీ

గ్రూప్ 2 పరీక్ష కేంద్రాలను విశాఖ జిల్లా కలెక్టర్ ఎం. ఎన్ హరీధర ప్రసాద్ తనిఖీ చేశారు, దీనిలో భాగంగా ఏయూ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాల ను తనిఖీ చేశారు. అన్ని కేంద్రాలలో నిర్ణీత సమయానికి పరీక్షలు మొదలవగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతీ కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించారు. పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య పరీక్షలు జరుగుతున్నాయి.

నెల్లూరు జిల్లాలోనూ..

నెల్లూరు జిల్లాలో జ‌రిగిన గ్రూప్ - 2 ప‌రీక్షలు ఎక్కడా ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ప్ర‌శాంతంగా ముగిశాయ‌ని స‌బ్ క‌లెక్ట‌ర్‌, కో ఆర్డినేట‌ర్ ఆఫీస‌ర్ పూజ తెలిపారు. మొత్తం 4102 మంది అభ్య‌ర్థులు హాజ‌రు కావాల్సి ఉండ‌గా 3546 మంది అభ్య‌ర్థులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యార‌ని, 556 మంది గైర్హాజ‌రైన‌ట్లు ఆమె వివ‌రించారు. మొత్తం ఏడు సెంట‌ర్ల‌లో ప‌రీక్ష‌లు జ‌రిగాయ‌న్నారు.

గ్రూప్-2 ఎగ్జామ్ సెంటర్ కు నవ వధువు

రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల సందర్భంగా తిరుపతిలో ఆసక్తికర ఘటన జరిగింది. చిత్తూరుకు చెందిన మమత అనే యువతి పెళ్లి పీటల నుంచి నేరుగా తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రానికి చేరుకుంది. వివాహం తర్వాత సమయం లేకపోవడంతో పెళ్లి దుస్తుల్లోనే పరీక్షకు హాజరైంది. దీంతో ఆ యువతి పట్టుదలను చూసి పలువురు అభినందించారు.

Tags

Next Story