AU VC: ఆంధ్ర వర్శిటీ పూర్వ వీసీ ప్రసాదరెడ్డిపై ఫిర్యాదుల వెల్లువ

AU VC: ఆంధ్ర వర్శిటీ పూర్వ వీసీ ప్రసాదరెడ్డిపై ఫిర్యాదుల వెల్లువ
హై కోర్ట్ కు విచారణకు రానున్న ప్రజా ప్రయోజన వ్యాజ్యం

ఆంధ్ర వర్శిటీ పూర్వ ఉపకులపతి ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. నాలుగేళ్లలో యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారని ఆరోపిస్తూ ..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అలుమ్ని అసోసియేషన్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఇది నేడు విచారణకు రానుంది. పూర్వ వీసీ నిర్ణయాలతో సీనియర్‌ ఆచార్యులు అవకాశాలు కోల్పోయారని ఆరోపిస్తూ..వీటికి సంబంధించిన వివరాలతో కూడిన వినతిపత్రాన్ని గవర్నర్‌కు సంఘం ప్రతినిధులు పంపారు. ప్రసాదరెడ్డిపై లోకాయుక్త లేదా హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించేలా ప్రభుతాన్ని ఆదేశించాలని కోరారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ వీసీ ప్రసాదరెడ్డి తీసుకున్న నిర్ణయాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో ఆయన చేపట్టిన నియామకాలు వివాదాస్పదమయ్యాయి. ప్రైవేటు కళాశాలలో పనిచేసిన జేమ్స్‌ స్టీఫెన్‌కు అర్హత లేకున్నా అంబేడ్కర్‌ అధ్యయన కేంద్రం ఛైర్‌ ప్రొఫెసర్‌గా తాత్కాలిక నియామకం పేరుతో వర్సిటీలో స్థానం కల్పించారు. కొద్దిరోజులకే ట్రాన్స్‌ డిసిప్లినరీ రీసెర్చ్‌ హబ్‌ డీన్‌గానూ... ఆయనకు బాధ్యతలు అప్పగించారు. వర్సిటీలో కనీసం రెండేళ్ల ప్రొబేషన్‌ పూర్తి కాకుండానే సీనియర్‌ ఆచార్యులను పక్కనపెట్టి సెప్టెంబరులో ...రిజిస్ట్రార్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక రిజిస్ట్రార్‌గా పనిచేసిన ప్రొఫెసర్‌ వి.కృష్ణమోహన్‌ 2020 ఆగస్టు 31న విశ్వవిద్యాలయ సేవల నుంచి విరమణ పొందారు. ఆయనను రిజిస్ట్రార్‌ పదవిలో కొనసాగించాలని ప్రసాదరెడ్డి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖలు రాశారు. విద్యా సంబంధిత కార్యకలాపాల్లో ఆయన అనుభవం వర్సిటీకి అవసరమని చెప్పడంతో మూడుసార్లు పదవీకాలం పొడిగించారు. మూడోసారి పొడిగించిన పదవీ కాలం కూడా సెప్టెంబరులో ముగియగా అక్టోబరులో ఓఎస్‌డీగా నియమించారు.


విద్యాసంస్థలు, పరిశ్రమలకు అనుబంధం ఏర్పరిచేందుకు అడ్జంక్ట్‌ ప్రొఫెసర్లను నియమించాలని యూజీసీ సూచించింది. దీనిని ఆసరాగా చేసుకొని వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు చెందిన వారిని ఏయూలో అనుబంధ ఆచార్యులుగా నియమించారు. ఇందుకు కనీసం దరఖాస్తులను ఆహ్వానించలేదు. 2021 నుంచి 2023 వరకు మొత్తం 45 మందిని వివిధ విభాగాల్లో నియమించారు. ముందస్తు అనుమతి లేకుండా ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు చేపట్టరాదని ..2021లో ప్రభుత్వం ఆదేశించినా పట్టించుకోకుండా 15 మంది సహాయ ఆచార్యులను నియమించారు.

ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల అధ్యాపకులను విశ్వవిద్యాలయాలకు కేటాయించడంపై హైకోర్టు స్టే విధించింది. ప్రసాదరెడ్డి, అప్పటి రిజిస్ట్రార్‌ వి.కృష్ణమోహన్‌ 113 డిగ్రీ కళాశాలల అధ్యాపకులను వివిధ విభాగాల్లో నియమించారు. దీనిపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు కాగా.. వారిని వెనక్కి పంపాలని కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశించారు. ప్రభుత్వం సైతం పాత ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. 73 కళాశాలల అధ్యాపకులు వెనక్కి వెళ్లగా, 40 కళాశాలలకు చెందిన లెక్చరర్లు ఇప్పటికీ వర్సిటీలో కొనసాగుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story