BILL GATES: ముగిసిన బిల్ గేట్స్ అమరావతి పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్కు గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ జై కొట్టారు. టెక్నాలజీ ఆధారిత పాలన, డిజిటల్ ప్రజాసేవలు, ఆరోగ్య రంగంలో ఆవిష్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఆయన ప్రశంసించారు. సోమవారం జరిగిన ఆయన ఏపీ పర్యటన కీలకంగా మారింది. ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బిల్ గేట్స్కు మంత్రులు నారా లోకేశ్, అనిత, అచ్చెన్నాయుడు, సత్యకుమార్తో పాటు జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన ప్రత్యేక విమానం కొంతసేపు విజయవాడ నగరం చుట్టూ గాల్లోనే చక్కర్లు కొట్టింది. పొగమంచు, లో విజిబిలిటీ కారణంగా ల్యాండింగ్కు ఆటంకం ఏర్పడింది. సుమారు అరగంటపాటు గాల్లోనే తిరిగిన అనంతరం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) క్లియరెన్స్ ఇవ్వడంతో విమానం సురక్షితంగా గన్నవరం ఎయిర్పోర్టులో ల్యాండ్ అయింది. దీంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
సచివాలయంలో కీలక భేటీ
విమానాశ్రయం నుంచి నేరుగా అమరావతిలోని వెలగపూడి సచివాలయానికి వెళ్లిన బిల్ గేట్స్కు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గేట్స్ బృందంతో కలిసి సమావేశం నిర్వహించారు. గేట్స్ ఫౌండేషన్కు చెందిన ఆరుగురు ప్రతినిధులు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని బిల్ గేట్స్ ప్రత్యేకంగా సందర్శించారు. డేటా ఆధారిత పాలన ఎలా అమలవుతోందో డిస్ప్లే వాల్ల ద్వారా చూపించారు. యువ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ధాత్రి రెడ్డి, మలికా గార్గ్, ప్రఖర్ జైన్, సౌరబ్ గౌర్, సురేశ్ కుమార్లు ప్రజెంటేషన్లు ఇచ్చారు. డేటా లేక్ వ్యవస్థ, అవేర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్, పీపుల్స్ పర్పెప్షన్, ఏజెంట్ స్పేస్ ఏఐ సెర్చ్ బార్ వంటి అంశాలను వివరించారు. రాష్ట్రంలోని అన్ని విభాగాలను డేటా లేక్ ద్వారా అనుసంధానించి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న విధానాన్ని గేట్స్ ఆసక్తిగా పరిశీలించారు.
అమరావతి నిర్మాణం
అమరావతి రాజధాని నిర్మాణ ప్రణాళికలపై కూడా గేట్స్ వివరాలు తెలుసుకున్నారు. మౌలిక వసతులు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, సస్టైనబుల్ అర్బన్ ప్లానింగ్పై సీఎం సమగ్ర వివరణ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా తీసుకుంటున్న చర్యలను గేట్స్ ప్రశంసించినట్లు అధికారులు తెలిపారు.
పర్యటన ముగింపు
సుమారు ఐదున్నర గంటలపాటు రాష్ట్రంలో పర్యటించిన బిల్ గేట్స్, పటమట చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో కొద్దిసేపు బ్యాడ్మింటన్ ఆడారు. అనంతరం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో ముంబై మీదుగా ఢిల్లీకి బయలుదేరారు. మొత్తంగా, ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న టెక్నాలజీ ఆధారిత పాలనకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సీఎం చంద్రబాబు విజన్పై గేట్స్ ప్రశంసలు కురిపించడం రాష్ట్రానికి గౌరవంగా నిలిచింది. డిజిటల్ గవర్నెన్స్, ఆరోగ్య రంగం, రాజధాని అభివృద్ధి అంశాల్లో భవిష్యత్ భాగస్వామ్యానికి ఈ భేటీ పునాది వేసిందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సీఎం, మంత్రులు, అధికారులతో సమావేశమై పలు అంశాలపై కీలకంగా చర్చించారు. సుమారు ఐదున్నరగంటలపాటు బిల్ గేట్స్ రాష్ట్రంలో పర్యటించారు. గేట్స్ పర్యటన విజయవంతంగా ముగియడంపై హర్షం వ్యక్తమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
